కూలగొట్టడం బీజేపీ పని.. పేదల ఆకలి తీర్చడం టీఆర్ఎస్ పని : జగదీష్ రెడ్డి

కూలగొట్టడం బీజేపీ పని.. పేదల ఆకలి తీర్చడం టీఆర్ఎస్ పని : జగదీష్ రెడ్డి

మునుగోడులో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని సవాల్ విసిరారు. కూలగొట్టడం, మంటలు పెట్టడం బీజేపీ పని అయితే.. పేదల ఆకలి తీర్చడం టీఆర్ఎస్ పని అన్నారు. మునుగోడు అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమన్నారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా అని ప్రశ్నించారు. 

గుజరాత్ సహా దేశం అంతా విద్యుత్ కష్టాలతో చీకట్లో మగ్గుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగులతో విరాజిల్లుతోందని జగదీష్ రెడ్డి అన్నారు. చండూర్ సభ తరువాత బీజేపీ ఓటమి ఖాయమని స్పష్టం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే జాలివేస్తోందని చెప్పారు. పార్టీని జోడించలేడు కానీ.. దేశాన్ని జోడించడానికి బయలుదేరారంటూ రాహుల్ను ఎద్దేవా చేశారు. రెండు సార్లు అవకాశం వచ్చినా పార్టీని నడపలేకపోయాడని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటేనని జగదీష్ రెడ్డి అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలు కేసీఆర్ పేరును కలవరిస్తున్నారని చెప్పారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని..సరైన ఫలితం ఇస్తారన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆరెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.