మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ బీఆర్ఎస్ మీటింగ్ జరిగినా..వీరిద్దరు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటున్నారు. తాజాగా బోడుప్పల్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
ఎందుకు పిలవలేదు..
మంత్రి మల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆత్మీయ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు ఆయన్ను పిలవటం లేదని మండిపడ్డారు. చంద్రారెడ్డితో పాటు..ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపు అందలేదన్నారు.
మైకు లాక్కునే ప్రయత్నం...
మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలో కూడా జరిగిందని సుధీర్ రెడ్డి అన్నారు. కానీ ఆ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సుధీర్ రెడ్డి మాట్లాడుతుండగానే....ఆగ్రహానికి గురైన మంత్రి మల్లారెడ్డి.. మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి..వారిద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తనే అని మంత్రి మల్లారెడ్డి తనకు తానే ప్రకటించుకోవడం ఏంటనన్నారు. అధిష్టానం ఏమైనా చెప్పిందా ? అని సుధీర్ రెడ్డి నిలదీశారు.
నేను ఒక వాచ్ మెన్
మేడ్చల్ నియోజక వర్గానికి తాను వాచ్మెన్లా పనిచేస్తున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్..,మంత్రి కేటీఆర్ చొరవతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. బోడుప్పల్ వక్ఫ్ బోర్డు సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఒరిగేది లేదని..తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందన్నారు.