
- 2050 నాటికి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
- మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని 2050 నాటికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఇందులో భాగంగా 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించామని తెలిపారు. గురువారం హైదరాబాద్లోని ఒక హోటల్లో నిర్వహించిన సీఐఐ సమ్మిట్లో ఆయన మాట్లాడారు.
రివర్ ఫ్రంట్లో భాగంగా అమ్యూజ్మెంట్ పార్కులు, జలపాతాలు, వాటర్ స్పోర్ట్స్, చిన్న వ్యాపారాలు చేసే వారి కోసం ప్రత్యేక సదుపాయాలు, పీపీపీ పద్ధతిలో షాపింగ్ మాల్స్ నిర్మిస్తామని చెప్పారు. మూసీ నదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. తద్వారా కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక వ్యాపారులకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు.
సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్పెషల్ జోన్లు కేటాయిస్తామని తెలిపారు. రివర్ఫ్రంట్ ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఈ నిర్మాణం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్తో టూరిజం, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సదస్సులో ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, సీఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ సాయి డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.