మిస్ ​వరల్డ్ పోటీలకు రిహార్సల్స్..రేపు (మే 10న) సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ఆరంభ వేడుకలు

మిస్ ​వరల్డ్ పోటీలకు రిహార్సల్స్..రేపు (మే 10న) సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ఆరంభ వేడుకలు
  • 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ రాక
  • 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్.. 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ దేశాల కంటెస్టెంట్స్ స్టేజ్‌‌‌‌‌‌‌‌పై తమ నడకలు, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌తో అందంగా కనిపించారు.

 ప్రారంభ వేడుకలో భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక  మేళవింపుగా కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీవీఐపీ బ్లాకులు, మీడియా గ్యాలరీ, భద్రత, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.శుక్రవారం కూడా కంటెస్టెంట్లు రిహార్సల్స్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

‘తెలంగాణ జరూర్​ ఆనా’ ప్రచారం

బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే లా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫలితంగా పర్యాటక రంగానికి ఆదరణ పెరిగి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈవెంట్ గురించి దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన విమానాశ్రయాల్లో ప్రచారం కల్పిస్తున్నది. అలాగే మిస్ వరల్డ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా గురువారం నాటికి 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హైదరాబాద్​చేరుకున్నారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. రేపటిలోగా పోటీదారులందరూ నగరానికి చేరుకుంటారు.

5 కేంద్రాల్లో.. 5 వేల మందికి అవకాశం..

మిస్ వరల్డ్ పోటీలను వీక్షించాలనుకునే తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. (https://tourism.telangana.gov.in/events-single/miss-world-event) చేసుకున్న వారికి ఐదు కేంద్రాల్లో వేయి మందికి చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, మొబైల్ నెంబర్, వయసు, వృత్తితో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే వారి వయసు తప్పకుండా 18 ఏళ్లు పూర్తై ఉండాలి. 

ఓల్డ్ సిటీలో హెరిటేజ్ వాక్.. 

ఈ నెల13 న సాయంత్రం చార్మినార్, లాడ్ బజార్ లలో సాంస్కృతిక వైభవం, చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు. 120 దేశాల మిస్ వరల్డ్ ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమం 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించనున్నారు.