ఎమ్మెల్యే ఇంట్లో రికార్డు స్థాయిలో చదివింపులు

ఎమ్మెల్యే ఇంట్లో రికార్డు స్థాయిలో చదివింపులు

ఓ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన వేడుకలో భాగంగా రూ.10 కోట్లు చదివింపులు వచ్చాయి. తమిళనాడులోని పుదుక్కొట్టైలో జరిగిన ఓ విందులో రికార్డు స్థాయిలో వసూలైన చదివింపులు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వందేళ్లుగా నిర్వహిస్తున్న ఈ చదివింపుల వేడుకను అక్కడి ప్రాంత ప్రజలు తమ ఆర్థిక స్థోమతను బట్టి విందు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో పేరావూరణి నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ కుమార్ తన మనవడి చెవులు కుట్టే వేడుక, చదివింపుల విందు ఒకేసారి నిర్వహించారు. ఈ వేడుకలో మాంసాహారులకు, శాకాహారులకు ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. కాగా విందుకు వచ్చిన వారు తమ తోచినంత ఇచ్చారు. అది మొత్తంగా రూ.10 కోట్ల వరకు వసూలు కావడం చెప్పుకోదగిన విషయం.

ఎమ్మెల్యే నిర్వహించిన ఈ వేడుకకు దాదాపు 15 వేల మంది అతిథులు వచ్చినట్టు సమాచారం. 500 మందితో ఆహారం  తయారు చేయించగా.. 1500 కేజీల మాంసాన్ని వండినట్టు తెలుస్తోంది. ఇక చదివింపుల కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేశారట. అంతే కాకుండా ఈ విందు కార్యక్రమంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సెక్యూరిటీని కట్టుదిట్టంగా పెట్టారట. ఈ వేడుకకు వచ్చిన వారంతా రూ.వెయ్యి నుంచి రూ.5 లక్షల వరకు చదివింపులు జరిపినట్టు సమాచారం.