హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు, అదే రోజు రాష్ట్ర అధికారిక గెజిట్లో కూడా విడిగా నోటిఫికేషన్లు ప్రచురిస్తారు. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.
18వ తేదీ సాయంత్రం ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ లోపు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 29వ తేదీన ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ జరనుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్ తొమ్మిదో తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.