గుంటూరు ప్రజలకు నమస్కారం : తెలుగులో మోడీ ప్రసంగం

గుంటూరు ప్రజలకు నమస్కారం : తెలుగులో మోడీ ప్రసంగం

 గుంటూరు జిల్లా : గుంటూరు పట్టణంలో బీజేపీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. కేంద్రమంత్రులు, జాకీయ- రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు, మాజీ కేంద్రమంత్రులు ఈ సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని ప్రధానమంత్రి తెలుగులో మొదలుపెట్టారు. తెలుగు ప్రసంగం అయినా కూడా… ఆయన పేపర్ చూడకుండా.. జనాలను చూస్తూ మాట్లాడారు. ఆయన తెలుగు ప్రసంగం సభకు వచ్చిన వారిని ఆకట్టుకుంది.

మోడీ తెలుగులో మాట్లాడుతూ “భారత్ మాతాకీ జై. అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్, దళిత రత్నం, కవి కోకిల గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం.  మహా కవి తిక్కన జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం” అని మోడీ చెప్పారు.

భారీ సంఖ్యలో జనం ఉత్సాహంగా వచ్చారనీ.. ప్రజలు చూపించే ప్రేమ… వారికోసం పనిచేయడానికి తనకు మరింత ప్రేరణ ఇస్తుందని చెప్పారు. మహా స్వాతంత్ర సేనాని వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ ఇక్కడినుంచే పోరాడారని.. అలాంటి  గుంటూరు నేలకు నమస్కరిస్తున్నా అని అన్నారు. “గుంటూరులోనే అమరావతి ఉంది. ఆద్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. అమరావతి నయా ఆంధ్రప్రదేశ్, నయా భారత్ అభివృద్ధి కేంద్రంగా ఉంది. కేంద్రం కూడా అమరావతి హృదయ్ యోజన, హెరిటేజ్ సిటీగా పేరు కల్పించాం” అని చెప్పారు మోడీ.