డీఎడ్ కాలేజీలు సగం మూతవడ్డయ్​

డీఎడ్ కాలేజీలు సగం మూతవడ్డయ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగైదేండ్లలో సగానికిపైగా డిప్లొమా ఇన్‌‌ ఎడ్యుకేషన్‌‌ (డీఎడ్​) కాలేజీలు మూతపడ్డాయి. టీచర్ పోస్టులను సర్కారు భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సులో చేరేందుకు స్టూడెంట్లు ఆసక్తి చూపించడం లేదు. ఫీజు కూడా తక్కువగా ఉండటం, ఆ మొత్తాన్ని సర్కారు ఆలస్యంగా ఇస్తుండటంతో నిర్వహణ భారమై మేనేజ్​మెంట్లు కాలేజీలను మూసేస్తున్నాయి.  2016–17లో రాష్ట్రంలో  212 డీఎడ్​ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. అంటే నాలుగైదేండ్లలోనే 112 కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్నవాటిలో ఉమ్మడి జిల్లాకొకటి చొప్పున పది సర్కారు కాలేజీలు కాగా.. మిగతావి 90  ప్రైవేటు కాలేజీలు. 2017–18లో 11,500 డీఎడ్​ సీట్లుంటే, 7,650 మాత్రమే భర్తీ అయ్యాయి. గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 మాత్రమే నిండాయి. ఏటా అప్లయ్​ చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. గతేడాది మెజార్టీ ప్రైవేటు కాలేజీల్లో 20 మందిలోపే స్టూడెంట్లు చేరారు. 

టీఆర్టీ లేక తగ్గిన డిమాండ్ 

డీఎడ్​ చేసిన వారు ఎస్జీటీ పోస్టులకు మాత్రమే అర్హులు. గతంలో బీఎడ్​తో పోలిస్తే డీఎడ్​ చేస్తే పక్కా టీచర్ జాబ్ అన్నట్టు ప్రచారం ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 2017లోనే అరకొర ఖాళీలతో టీచర్​ పోస్టులను భర్తీ చేసింది. మళ్లీ టీచర్  పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తుందో క్లారిటీ లేదు. మరోపక్క స్టూడెంట్, టీచర్ రేషియోతో పోలిస్తే ఇప్పటికే వేల టీచర్​ పోస్టులు ఎక్కువగా ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఎస్జీటీ పోస్టుల భర్తీ అనుమానంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే డీఎడ్​  పూర్తిచేసినవాళ్లు లక్షల్లో ఉన్నారు.ప్రస్తుతం డీఎడ్​ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి అందులో చేరేందుకు స్టూడెంట్లు ఇంట్రస్ట్​ చూపడం లేదు. 

నిర్వహణ భారమై..

ప్రస్తుతం ఒక్కో ప్రైవేటు డీఎడ్​ కాలేజీలో 50 సీట్లు ఉండగా.. వాటిలో పది సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారికి ఏటా రూ. 11 వేల ఫీజు రీయింబర్స్​మెంట్, రూ. 1,500 ఇతర ఖర్చుల కింద సర్కారు ఇస్తుంది. ఈ ఫీజుతో కాలేజీల నిర్వహణ కష్టమని,  జీతాలివ్వడం కష్టమేనని  మేనేజ్మెంట్లు అంటున్నాయి. వచ్చే ఫీజునూ ఏండ్లుగా సర్కారు పెండింగ్​లో పెడుతుండటం ఇబ్బందిగా మారింది. దీంతో కాలేజీలను క్లోజ్​ చేయడంపైనే దృష్టి పెట్టాయి. ఇందుకోసం ఇప్పటికే చాలా కాలేజీలు అప్లయ్​ చేసుకున్నాయి. 

సర్కారు తీరు వల్లే ...

రాష్ట్ర సర్కారు తీరు వల్లనే డీఎడ్​ కోర్సుకు డిమాండ్ తగ్గుతోంది. ఒక్కో కాలేజీకి 50 సీట్లకు పర్మిషన్ ఇచ్చారు. కన్వీనర్ కోటాలో ఒక్కో స్టూడెంట్​కు రూ. 12,500 ఫీజు ఇస్తున్నారు. ఏండ్ల నుంచి ఈ ఫీజును పెంచడం లేదు. దీంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారింది.  
‑ డాక్టర్ రామదాసు, 
ఎస్​సీటీఈ సెంట్రల్ కమిటీ మెంబర్