PBKS vs MI: ముంబైని ఆదుకున్న సూర్య.. క్వాలిఫయర్ 1 ఆడాలంటే పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

PBKS vs MI: ముంబైని ఆదుకున్న సూర్య.. క్వాలిఫయర్ 1 ఆడాలంటే పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

క్వాలిఫయర్ 1 లక్ష్యంగా జరుగుతున్న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ పోటీ పోటీగా ఉంది. సోమవారం (మే 26) జైపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటింగ్ లో రాణించింది. సూర్య కుమార్ యాదవ్ (39 బంతుల్లో 57:6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మరోసారి ముంబైకి ఆపద్బాంధవుడయ్యాడు. దీంతో హార్దిక్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, విజయ్ కుమార్ వైశుక్, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. హరిప్రీత్ బ్రార్ కు ఒక వికెట్ దక్కింది.   

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. ఓపెనర్లు రికెల్ టన్, రోహిత్ శర్మ క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం ఎక్కువగా తీసుకున్నారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 45 పరుగులు జోడించిన తర్వాత రికెల్ టన్ ను మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. పవర్ ప్లే లో 52 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ముంబై.. ఆ తర్వాత సూర్య, రోహిత్ కొన్ని ఓవర్ల పాటు నిదానంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ కు ప్రాధాన్యమిచ్చే క్రమంలో ముంబై పరుగుల వేగం తగ్గింది. క్రీజ్ లో ఉన్నంత వరకు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ శర్మ 21 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఆ తర్వాత తిలక్ వర్మ ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. క్రీజ్ లోకి రాగానే ఫోర్, సిక్సర్ వేసి ఊపు కనిపించిన విల్ జాక్స్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సూర్య కుమార్ యాదవ్ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో నమన్ ధీర్ (20) కూడా బ్యాట్ ఝుళిపించడంతో ముంబై 180 పరుగుల మార్క్ అందుకుంది.