
జైపూర్: రాజస్థాన్లో తొమ్మిదేండ్ల బాలుడి సాక్ష్యంతో అతని తండ్రి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. తల్లి మరో నలుగురు వ్యక్తులతో కలిసి తన తండ్రిని హత్య చేయించిందని బాలుడు పోలీసులకు వెల్లడించాడు. అల్వార్ జిల్లా ఖేర్లి టౌన్లో ఈ నెల 7న ఈ ఘటన చోటుచేసుకుంది. వీరు జాతవ్, అనిత భార్యాభర్తలు. ఖేర్లి టౌన్లో నివాసం ఉంటున్నారు. వీరు టెంట్ హౌస్ నిర్వహిస్తుండగా.. అనిత జనరల్ స్టోర్ నడుపుతుంది. అక్కడికి సమీపంలో స్నాక్స్ అమ్మే కాశీరామ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ఆ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకొని వీరు హత్యకు కుట్ర పన్నారు. ఇందుకు కాశీరామ్ రూ.2 లక్షలు చెల్లించి మరో నలుగురు వ్యక్తులను మాట్లాడుకున్నాడు. ఈ నెల 7న రాత్రి వీరును హత్య చేశారు. ఆ తర్వాత వీరూ వదినకు అనిత ఫోన్ చేసి తన భర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని చెప్పింది. అయితే, వీరు మృతిపై అతని అన్నయ్య అనుమానం వ్యక్తం చేశాడు. పోస్ట్మార్టం తర్వాత గొంతు కోసి చంపినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. ఆ రోజు జరిగిన విషయమంతా వీరు తొమ్మిదేండ్ల కుమారుడు పోలీసులకు వివరించాడు.
‘‘ఆ రోజు రాత్రి పప్పా ఇంటికి ఆలస్యంగా వచ్చి పడుకున్నాడు. రాత్రి కాశీరామ్ అంకుల్తో పాటు మరో నలుగురు మా ఇంట్లోకి వచ్చారు. మంచం కదులుతున్న శబ్దం విని లేచి చూస్తే.. కాశీరామ్ అంకుల్పప్పా ముఖాన్ని దిండుతో నొక్కుతున్నాడు. ఆ టైంలో అమ్మ పక్కనే నిలబడి చూస్తుంది. నేను ఆపేందుకు వెళ్లగా కాశీరామ్ అంకుల్ నన్ను ఎత్తుకుని సైలెంట్గా ఉండమని బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత పప్పా కదలడం మానేశాడు. అమ్మ చాలా చెడ్డది. ఆమే పప్పాను చంపేసింది" అని ఆ పిల్లవాడు పోలీసులకు చెప్పాడు.