
కాంటర్బరీ: ఇంగ్లండ్ గడ్డపై ఇండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (246 బాల్స్లో 24 ఫోర్లు, 1 సిక్స్తో 186 బ్యాటింగ్) భారీ సెంచరీతో దుమ్మురేపాడు. సర్ఫరాజ్ ఖాన్ (92) దంచికొట్టడంతో.. ఇంగ్లండ్ లయన్స్తో శుక్రవారం మొదలైన అనధికార తొలి టెస్ట్లో ఇండియా–ఎ 90 ఓవర్లలో 409/3 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్కు నాయర్తో పాటు ధ్రువ్ జురెల్ (82 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు మెరుగైన ఆరంభం దక్కలేదు. జోష్ హల్ (2/51), ఎడీ జాక్ (1/51)తో పాటు మిగతా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడటంతో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), అభిమన్యు ఈశ్వరన్ (8) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. బౌండ్రీలతో బ్యాట్లు ఝుళిపించే ప్రయత్నం చేసినా ఇంగ్లిష్ స్వింగ్ ముందు నిలవలేకపోయారు. దీంతో ఇండియా 51/2తో కష్టాల్లో పడింది.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కరుణ్ నాయర్ కౌంటీల్లో ఆడిన తన అనుభవాన్ని ఉపయోగించి ఇంగ్లండ్ బౌలింగ్ను దీటుగా ఎదుర్కొన్నాడు. రెండో ఎండ్లో సర్ఫరాజ్ కూడా నిలిచాడు. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదుతూ క్రమంగా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న సర్ఫరాజ్ను 57వ ఓవర్లో హల్ ఔట్ చేయడంతో మూడో వికెట్కు 181 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే కరుణ్155 బాల్స్లో సెంచరీ పూర్తి చేశాడు. 232/3 వద్ద వచ్చిన జురెల్ కూడా కరుణ్కు అండగా నిలిచాడు. సింగిల్స్తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు. ఆట చివర్లో ఇంగ్లండ్ కొత్త బాల్ తీసుకున్నా ఈ జంటను మాత్రం విడదీయలేకపోయింది. 68 బాల్స్లో ఫిఫ్టీ అందుకున్న జురెల్.. కరుణ్తో నాలుగో వికెట్కు అజేయంగా 177 రన్స్ జోడించి రోజు ముగించాడు.