నాంపల్లి రైల్వే స్టేషన్​కు కొత్త కళ.. ఎంఎంటీఎస్ స్టేషన్లకూ సరికొత్త హంగులు

నాంపల్లి  రైల్వే స్టేషన్​కు కొత్త కళ.. ఎంఎంటీఎస్ స్టేషన్లకూ సరికొత్త హంగులు
  • అమృత్ భారత్ ​ స్కీమ్​లో భాగంగా  బ్యూటిఫికేషన్

 సికింద్రాబాద్, వెలుగు:  సిటీలోని రైల్వే స్టేషన్లు కొత్త కళను సంతరించుకోనున్నాయి. నాంపల్లి రైల్వేస్టేషన్​తో పాటు ఎంఎంటీఎస్​ స్టేషన్లు ఆధునీకరించనున్నారు. ‘అమృత్ భారత్’​ రైల్వేస్టేషన్ల​అభివృద్ధి స్కీమ్​లో భాగంగా రూ.310 కోట్లతో వీటిని అందంగా తీర్చిదిద్దనున్నారు. కొత్త భవన నిర్మాణాలతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. 

నిజాం కాలంలో సిటీ నడిబొడ్డున కట్టిన నాంపల్లి రైల్వే స్టేషన్​కు116 ఏండ్ల చరిత్ర ఉంది. ఈ స్టేషన్​ నుంచి ప్రతిరోజు  సుమారు 30 వేల మంది ప్యాసింజర్లు   వెళ్తుంటారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి 83 ఎక్స్​ప్రెస్​ రైళ్లు, ఎంఎంటీఎస్​లు రాకపోకలు సాగిస్తుంటాయి. బేగంబజార్, మొజంజాహీ మార్కెట్​వంటి వ్యాపార సముదాయాలకు అనువైనది కావడంతో  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధిక పార్సిళ్ల బుకింగ్​లు ఇక్కడే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఆధునీకరిస్తున్న నాంపల్లి స్టేషన్​ వద్ద ఆఫీసులను భారీగా విస్తరించనున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఇప్పుడున్న స్టేషన్​ ముందు భాగం పూర్తిగా మార్పుచేయనున్నారు. ఈ స్టేషన్​నుంచి మెట్రో స్టేషన్​కు నేరుగా ర్యాంపును కూడా నిర్మించనున్నారు.

రూపురేఖలు మారనున్న ఎంఎంటీఎస్​ స్టేషన్​లు 

అమృత్ ​భారత్​ రైల్వే స్టేషన్ల అభివృద్ధి స్కీమ్​లో భాగంగా దేశవ్యాప్తంగా 512 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తుండగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 50 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో సిటీలోని హఫీజ్​పేట,హైటెక్​సిటీ, మలక్​పేట​,ఉప్పుగూడ, బేగంపేట ఎంఎంటీఎస్​ స్టేషన్లు ఉండగా ఒక్కోస్టేషన్​కు రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్లతో కొత్తగా రూపొందిస్తారు. స్టేషన్లకు ఇరువైపులా ఎంటర్, ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ర్యాంపులు, రూఫ్​ ప్లాజా, పార్కింగ్​ఏరియా, స్టేషన్​కు రోడ్డు కనెక్టివిటీ, రైళ్ల రాకపోకలపై ఎప్పటికప్పుడు  ప్రయాణికులకు అందించేందుకు     డిస్​ప్లే సిస్టమ్​, వెయిటింగ్​ హాల్స్​వంటి ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్యాసింజర్లు ఒక వైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు మెట్ల మార్గంతో పాటు ఎస్కలేటర్ల ఏర్పాటు, అవసరమైన చోట లిఫ్టులు కూడా నిర్మిస్తారు. వచ్చే ఏడాది నాటికి స్టేషన్లు కొత్త హంగులతో కనువిందు చేయనున్నాయి.