
- సరిపడ సీడ్స్, ఎరువులు ఇప్పటికే సిద్ధం
- క్రాప్ ప్లాన్ రెడీ చేస్తున్న వ్యవసాయశాఖ
హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్లో పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పంట ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నది. వానాకాలం సీజన్లో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో వేయాలనే దానిపై వ్యవసాయ ప్రణాళికను ఖరారు చేస్తున్నది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు కాగా..
ఈసారి ఏకంగా 1.50 కోట్ల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోనుంది. అంటే అదనంగా 24 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేందుకు అగ్రికల్చర్శాఖ రెడీ అవుతున్నది. ఏ పంట ఎన్నెన్ని ఎకరాల్లో సాగు చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చేందుకు ఇప్పటి నుంచే అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది.
పత్తికి అధిక ప్రోత్సాహం..
రానున్న వానాకాలం సీజన్లో 1.50 కోట్ల ఎకరాలకుగాను, అత్యధికంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి సర్కారు సన్నాహాలు చేస్తున్నది. గతేడాది వానాకాలం సీజన్లో 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈసారి అదనంగా మరో 25 లక్షల ఎకరాలకు పైగా పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతేడాది సాధారణ సాగు కంటే 6 లక్షల ఎకరాల్లో పత్తి సాగు తగ్గడంతో మార్కెట్లో పత్తికి కొంత డిమాండ్ వచ్చింది.
మద్దతు ధర కంటే భారీగా ధరలు పలికింది. ఒకానొక సందర్భంలో.. క్వింటాకు రూ. 22 వేల ధర కూడా వచ్చింది. దీంతో ఈసారి రైతులు పత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పత్తి సాగువైపు రైతులను మళ్లించాలని నిర్ణయించింది. పత్తి, కంది సాగు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్లో వరి సాగు విస్తీర్ణం 65 లక్షల ఎకరాలుకాగా, ఈసారి కూడా అంతే స్థాయిలో సాగు చేసుకునేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. గతేడాది వానాకాలం సీజన్లో కంది 4.74 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. వాస్తవానికి రాష్ట్రంలో సాధారణ సాగు 7.69లక్షల ఎకరాలు సాగుకాగా.. అంతే స్థాయిలో ఈసారి కంది సాగు పెంచేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.
సీడ్ ప్లాన్ సిద్ధం చేస్తున్న యంత్రాంగం
క్రాప్ ప్లాన్ లో భాగంగా విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది.1.50 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాస్తవంగా ఈ సీజన్కు 14.41 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా.. 20.50 లక్షల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ప్రైవేట్ ద్వారానే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.
మిగిలిన విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తదితర సంస్థలు సమకూర్చుతున్నాయి. రైతుల వద్ద 50వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. జూన్ప్రారంభంనాటికి 5 లక్షల టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకున్నామని..నాలుగున్నర లక్షల టన్నుల యూరియా, నిల్వలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.