న్యూఢిల్లీ: నీట్-యూజీ రీ ఎగ్జామ్లో అవకతవకలపై విచారణతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తన వ్యక్తిగత సమస్యలతో పాటు దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ సంబంధించిన సాధారణ అభ్యర్థనలను ఒకే పిటిషన్లో కలిపి సమర్పించారని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి మిశ్రమ అంశాలు ఉన్న పిటిషన్ను ఒకే రూపంలో విచారించలేమని తెలిపింది.
నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో 2026, జూన్ 21న ఎన్టీఏ నీట్ యూజీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అయితే, నీట్ రీ ఎగ్జామ్లో కూడా అవకతకవలు జరిగాయని.. దీనిపై విచారణ జరపడంతో పాటు పరీక్షలు నిర్వహించడంలో విఫలమవుతోన్న ఎన్టీఏ రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం (ఆగస్ట్ 19) ఈ పిటిషన్ను విచారించేందుకు తిరస్కరించింది. కోర్టు విచారణకు నిరాకరించడంతో పిటిషనర్ తరపు న్యాయవాది ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
కేంద్రం, NTA వాదన
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జూన్ 21న జరిగిన నీట్ యూజీ రీ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. నీట్ రీ ఎగ్జామ్లో ఎలాంటి OMR షీట్ల ట్యాంపరింగ్ లేదా అక్రమాలు జరగలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానం అత్యంత సురక్షితమైనదని కోర్టుకు తెలిపారు.
