
- బెంగాల్, ఏపీలో హింసాత్మక ఘటనలు
- ఒడిశా, బెంగాల్ లో మొరాయించిన ఈవీఎంలు
- దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో పూర్తయిన పోలింగ్
- ఇప్పటివరకు 379 సీట్లకు ముగిసిన ఎన్నికలు
- ఏపీ, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలూ పూర్తి
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో ఫోర్త్ ఫేజ్ పోలింగ్ కూడా ముగిసింది. బెంగాల్, ఏపీలోని పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నాలుగో విడతలో భాగంగా సోమవారం 9 రాష్ట్రాలు, ఒక యూటీలోని 96 సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో లోక్ సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి 64% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.
ఫోర్త్ ఫేజ్లో భాగంగా ఏపీ (25), తెలంగాణ (17), యూపీ (13), మహారాష్ట్ర (11), మధ్యప్రదేశ్ (8), వెస్ట్ బెంగాల్ (8), బిహార్ (5), ఒడిశా (4), జార్ఖండ్ (4), జమ్మూకాశ్మీర్ (1)లోని ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జమ్మూకాశ్మీర్ లో అత్యల్పంగా 37.93%, బెంగాల్లో అత్యధికంగా 76.56% పోలింగ్ నమోదైంది. ఈ విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. జమ్మూకాశ్మీర్ లో శ్రీనగర్ లోక్ సభ స్థానానికి పోలింగ్ జరిగింది.
కాశ్మీరీ పండిట్ల ఓట్లు గల్లంతు
శ్రీనగర్ లోక్ సభ స్థానం పరిధిలో ఓటింగ్లో పాల్గొనేందుకు కాశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. జమ్మూలో ఏర్పాటు చేసిన స్పెషల్ పోలింగ్ కేంద్రాలకు వీరు భారీగా తరలివచ్చారు. అయితే, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, తిరిగి వచ్చిన అనేక మంది కాశ్మీరీ పండిట్ల ఓట్లు గల్లంతు కావడంతో వారు ఓటు వేయలేకపోయారు. అనంతనాగ్–రాజౌరి స్థానానికి కూడా పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా..
బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ ను 25వ తేదీ(ఆరో విడత)కి మార్చారు. ఇక శ్రీనగర్ లో అబ్దుల్లా ఫ్యామిలీకి చెందిన మూడు తరాల వాళ్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా, ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లా, ఇద్దరు మనుమలు జహీర్, జమీర్, ఇతర కుటుంబసభ్యులు ఓటు వేశారు.
బెంగాల్ లో హింసాత్మక ఘటనలు
నాలుగో విడత ఎన్నికల సందర్భంగా వెస్ట్ బెంగాల్ లోని పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీర్భూమ్, బర్ధమాన్–దుర్గాపూర్ లోక్ సభ స్థానాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. కల్నా గేట్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ ను టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుని రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడితో బీజేపీ నేతల కార్లు ధ్వంసమయ్యాయి. అల్లరిమూకను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒక జవాన్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావం కాగా, అతడు ఓ మీడియా సంస్థ వెహికల్ లోకి ఎక్కి తప్పించుకున్నారు.
పోలింగ్ ఏజెంట్లను బూత్ లలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, ఈవీఎంలు మొరాయిస్తున్నాయంటూ 1,088 ఫిర్యాదులు అందాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఒడిశాలోనూ ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం మాక్ పోలింగ్ సందర్భంగా 65 బ్యాలెట్ యూనిట్లు, 83 కంట్రోల్ యూనిట్లు, 110 వీవీప్యాట్లను రీప్లేస్ చేశారు.
379 సీట్లకు పోలింగ్ పూర్తి
లోక్ సభలోని మొత్తం 543 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు 3 దశల్లో 283 సీట్లకు పోలింగ్ పూర్తయింది. సోమవారం నాలుగో విడతతో కలిపి 379 స్థానాల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 20, 25, జూన్ 1 తేదీల్లో మరో 3 విడతల పోలింగ్ జరగాల్సి ఉంది.