నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో పెట్టుబడి పెట్టడానికి వయస్సును 65 నుంచి 70 వరకు పెంచాలని పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీయే) ప్రతిపాదించింది. 60 సంవత్సరాల తరువాత చేరిన చందాదారులు 75 ఏళ్ల వరకు తమ NPS ఖాతాలను కొనసాగించడానికి అనుమతించాలని కూడా ప్రపోజ్ చేసింది. ఇక నుంచి ‘మినిమమ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్రొడక్ట్’ ను కూడా తీసుకురావాలని సూచించింది. ప్రస్తుతం ఎన్పీఎస్ రాబడులు ఎన్పీఎస్ పెన్షన్ ఫండ్ల పనితీరును బట్టి ఉంటున్నాయి. ‘‘ వయోపరిమితిని 60 నుండి 65 పెంచడంతో గత 3.5 సంవత్సరాల్లో 60 ఏళ్లు పైబడిన 15 వేల మంది ఎన్పీఎస్లో చేరారు. మరింత మందిని ఎన్పీఎస్లోకి తీసుకురావాలనే ఆలోచనతో వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాం’’ అని పీఎఫ్ఆర్డీయే చైర్మన్ సుప్రతీం బందోపధ్యాయ్ గురువారం మీడియా సమావేశంలో అన్నారు. ఎన్పీఎస్ ఏజెంట్ల ఫీజులను పెంచడాన్ని పరిశీలిస్తున్నట్లు బందోపధ్యాయ్ తెలిపారు.
ఇన్వెస్ట్మెంట్ను వెనక్కి తీసుకోవచ్చు...
ఇక నుంచి పెన్షన్ మొత్తం రూ.5 లక్షల కన్నా తక్కువ ఉంటే వారి పెట్టుబడులను పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనను కూడా పీఎఫ్ఆర్డీయే పరిశీలిస్తోంది. ప్రస్తుతం రూ. రెండు లక్షల లోపు ఉంటేనే వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో 40 శాతం మొత్తానికి పన్ను వేస్తారు. మిగిలిన 60 శాతం మొత్తానికి పన్ను ఉండదు. పన్ను చెల్లించదగిన మొత్తాన్ని మీ ఆదాయానికి కలుపుతారు. శ్లాబ్ రేటు ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్పీఎస్లో 10 లక్షల మందిని చేర్పించాలని పీఎఫ్ఆర్డీయే టార్గెట్గా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల మంది కొత్తగా చేరారు. ఎన్పీఎస్ అటల్ పెన్షన్ యోజనతో (ఏపీవై) కలిపి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు కోటి మంది కొత్త ఖాతాదారులను చేర్పించడానికి ప్రయత్నిస్తామని పీఎఫ్ఆర్డీయే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.3 లక్షల మంది ఏపీవైలో చేరారు. ఎన్పీఎస్, ఏపీఎస్లోని దాదాపు రూ.5.78 లక్షల కోట్ల ఆస్తులను పీఎఫ్ఆర్డీయే నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ రెండు పథకాల్లో 4.2 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ‘‘ఎన్పీఎస్ వయోపరిమితి పెంచడం మంచిదే. కనీస పెన్షన్ మొత్తానికి కూడా హామీ ఇవ్వాలి’’ అని ఎస్బీఐ పెన్షన్ ఫండ్ ఎండీ, సీఈఓ నారాయణన్ అన్నారు.