- బాధితుడి లేఖను పిల్గా పరిగణించిన హైకోర్టు
- అధికారులకు నోటీసులు.. విచారణ 2 నెలలకు వాయిదా
హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్లోని బోయిగూడ మెట్రో పిల్లర్ బి 1006 వద్ద మెట్రో రైలు వచ్చి, వెళ్లేటప్పుడు భరించలేని సౌండ్స్ వస్తున్నాయని అందిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించింది. సికింద్రాబాద్కు చెందిన డాక్టర్ హనుమాన్లు రాసిన లేఖను పిల్గా పరిగణించిన హైకోర్టు, బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
చీఫ్ సెక్రటరీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్, మెట్రో రైలు ఎండీ, మెట్రోరైల్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఇతరులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.మెట్రో రైలు వెళ్లేప్పుడు బోయిగూడ మెట్రో పిల్లర్ బీ1006 వద్ద విపరీతమైన శబ్ధం వెలువడుతున్నది. దీని వల్ల వినికిడి, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
2010లో పర్యావరణ శాఖ వెలువరించిన జీవో 172 ప్రకారం పగలు 55, రాత్రిపూట 45 డెసిబుల్స్కు మించి శబ్దం వెలువడకూడదు. ఈ ఏడాది మార్చి నెలలో మెట్రో అధికారులు బోయిగూడ, జూబ్లీహిల్స్ బస్ స్టేషన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ల వద్ద మైట్రో రైలు వెళ్లేప్పుడు శబ్ధాన్ని రికార్డు చేశారు. బోయిగూడలోని ఎన్ఎంకే విఠల్ అపార్ట్మెంట్ నుంచి శబ్ధాన్ని నమోదు చేసినప్పుడు 80 డెసిబుల్స్ శబ్దం వచ్చింది.
కొత్తబోయిగూడ పిల్లర్ బీ1006 ట్రాక్ మలుపులో శబ్దాన్ని తగ్గించేలా చేయాలి. సౌర ధ్వని పలకలను మెట్రో రైల్వే కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలి. ఈ తరహా పలకలను ముంబాయి, చెన్నై నాగపూర్, బెంగళూరు, నోయిడా, కోల్కతాలో ఏర్పాటు చేశారు. దీని వల్ల శబ్ధ కాలుష్యం తగ్గడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి వీలుంటుంది. మెట్రో రైలు వెళ్లేప్పుడు ఆ మలుపులో శబ్ధకాలుష్యం వెలువడకుండా మెట్రో రైలు అధికారులు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలి.. అని పిటిషనర్ తన లేఖలో కోరారు.