హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) ప్రారంభం కానుంది. EBG గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఆదివారం (డిసెంబర్ 21) నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా మదాపూర్ HICC వేదికగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
టాలీవుడ్ ప్రో లీగ్కు హానరరీ చైర్మన్ గా దిల్ రాజు వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా హాజరయ్యారు. క్రికెట్ టీమ్ లో టాలీవుడ్ సెలబ్రిటీ ఆటగాళ్లు ఉంటారు. టీమ్ ఓనర్లుగా నిర్మాతలు వ్యవహరిస్తారు.
మొత్తం ఆరు జట్లతో ఫ్రాంచైజీ లీగ్గా TPL ను నిర్వహించనున్నారు. ఏడాదికి రెండు సీజన్లు నిర్వహణ ఉంటుంది. క్రికెట్తో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ కంటెంట్, ఫ్యాన్ జోన్లు ఉంటాయని అన్నారు. టాలీవుడ్ ఐక్యతే లక్ష్యంగా TPL నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సినీ పరిశ్రమలో ప్రతి వృత్తికి ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. అలై బలై ఇన్క్లూజన్ కాన్సెప్ట్ ప్రత్యేకత అని చెప్పారు. టాలీవుడ్ సంక్షేమానికి ఆదాయంలో భాగం, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సినిమా క్రీడల సంగమంగా టాలీవుడ్ ప్రో లీగ్ -ఉంటుందని ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజ్,అనిల్ రావిపూడి , బన్నీ వాసు తదితరులు హాజరయ్యారు.
టెక్నీషియన్స్ కల నిజమయ్యే సందర్భం: సెహ్వాగ్
ఈ కార్యక్రమానికి హాజరైన సెహ్వాగ్.. చాలామందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుందని అన్నారు. గొప్పగా ఆడాలి, టీమ్ ఇండియా లో ఆడాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారని తెలిపారు. సినీ స్టార్స్, టెక్నీషియన్స్ తో కలిసి ఇలాంటి లీగ్ ఏర్పాటు చేయడం, ఇందులో ఆడటం కూడా చాలా గొప్ప విషయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిత్యం సినిమాలతో బిజీ గా ఉండే టెక్నీషియన్స్ కి ఇది గొప్ప రిలీఫ్ మాత్రమే కాదు.. వాళ్ళ కల నిజం అయ్యే సందర్భం కూడా అని అన్నారు సెహ్వాగ్.
