- సైంటిఫిక్ ఆధారాల్లేవని, సురక్షితం కావని తేల్చిన ఎక్స్పర్ట్ కమిటీ
- లిస్టులో పారాసిటమాల్, డైసైక్లోమైన్,
- అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్ పెయిన్ కిల్లర్లు
- వెంటనే తయారీ నిలిపేయాలని కంపెనీలకు,
- అమ్మకాలు ఆపేయాలని మెడికల్ షాపులకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందుల తయారీ, విక్రయాలు, పంపిణీని నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో పాటు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ) సబ్ కమిటీ సమర్పించిన ఫైనల్ రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ మేరకు పార్లమెంట్లో శుక్రవారం కేంద్రం ప్రకటించింది.
ఈ కాంబినేషన్ మందుల వాడకానికి ఎలాంటి సైంటిఫిక్, చికిత్సాపరమైన ఆధారాలు లేవని, ఇవి అశాస్త్రీయమైనవని, వీటికంటే ఎంతో సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. నిషేధిత జాబితాలో ప్రధానంగా ఇన్ఫెక్షన్లకు వాడే అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేజ్ (+ లాక్టోబాసిల్లస్ / క్లోక్సాసిలిన్), సెఫ్యూరాక్సైమ్ + సెరాటియోపెప్టిడేజ్, సెఫాడ్రాక్సిల్ + ప్రోబెనెసిడ్లాంటి యాంటీ బయోటిక్స్తోపాటు, కడుపునొప్పి, నొప్పుల నివారణకు వాడే డైసైక్లోమైన్ + పారాసిటమాల్ + క్లిడీనియం బ్రోమైడ్ (+క్లోర్ డయాజెపాక్సైడ్), అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ + ఎథోహెప్టాజైన్, పారాసిటమాల్ + లిగ్నోకేన్లాంటి పెయిన్ కిల్లర్ కాంబినేషన్లు కూడా ఉన్నాయి.
స్కిన్ కేర్ మెడిసిన్ కూడా..
రూల్స్కు విరుద్ధంగా ఉన్న టైప్-2 డయాబెటిస్ మందు గ్లిక్లాజైడ్ + క్రోమియం పికోలినేట్తోపాటు స్కిన్ కేర్ కోసం వాడే ఉత్పత్తుల తయారీపై కూడా నిషేధం విధించినట్టు కేంద్రం పేర్కొన్నది. ఇందులో అలోవెరా, అలో ఎక్స్ట్రాక్ట్తో కూడిన జోజోబా ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, విటమిన్ ఏ/ఈ, అలాంటోయిన్, డైమెథికోన్, గ్లిజరిన్, ఆరెంజ్ ఆయిల్, హెర్బల్ మిశ్రమాలతో కూడిన 6 రకాల కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఉన్న ఫార్మా కంపెనీలున్నట్టు తెలిపింది.
మెడికల్ షాపులు, హోల్సేలర్లు అమ్మకాలను నిలిపివేయాలని, రూల్స్ ఉల్లంఘించి నిషేధిత మందులను విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు పేర్కొన్నది. డాక్టర్లు వీటిని రోగుల ప్రిస్క్రిప్షన్లలో రాయవద్దని స్పష్టం చేసినట్టు కేంద్రం వెల్లడించింది.
