- పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే పార్లమెంట్లో చర్చకు ముందుకొస్తామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. నీట్ వివాదం, విద్యార్థులపై లాఠీచార్జ్ను నిరసిస్తూ ఐదో రోజు శుక్రవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మకర ద్వారం ఎదురుగా ఆందోళన చేపట్టాయి. ఇందులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర ప్రతిపక్ష పార్టీలతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వంశీకృష్ణ, మల్లు రవి, అనిల్ కుమార్, రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖర్గే స్వయంగా.. ‘వీ వాంట్ జస్టిస్, గల్లీ గల్లీ పే షోర్ హై– మోదీ చోర్ హై’ అంటూ నినాదాలు ఇవ్వగా.. ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ‘మోదీ వీక్ హై– పేపర్ లీక్ హై’, ‘ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కరో’ వంటి నినాదాలతో పార్లమెంట్ ఆవ రణ మారుమోగింది. అనంతరం ప్రియాంక గాంధీ సైతం నినాదాలు చేయగా.. ఇందుకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కోరస్ ఇచ్చారు.
అనంతరం తెలంగాణ ఎంపీలతో కలిసి ఖర్గే మీడి యాతో మాట్లాడారు. పేపర్ లీక్పై దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఏం చెప్పాలనుకుంటున్నారో పార్ల మెంట్కు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధ రాత్రి సెల్ఫీ స్టేట్మెంట్లు కాదని, తెల్లారాక పార్లమెంట్కు వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు.
