భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరాలకు మించి జరుగుతోంది. 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ అవసరాలను కూడా ఉత్పత్తి మించిపోవడంతో.. మిగులు ఇథనాల్ను వినియోగించుకోవడానికి సరికొత్త మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి ఏర్పడింది. ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ప్రధాని సలహాదారు తరుణ్ కపూర్ ఈ విషయాలను వెల్లడించారు. ఇథనాల్ ఉత్పత్తి ఊహించినదాని కంటే ఎక్కువశాతం పెరిగిందని, బ్లెండింగ్కు అవసరమైన దానికంటే ప్రస్తుతం మన దగ్గర మిగులు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.
E20 బ్లెండింగ్ సాధించడం ఒక గొప్ప విజయమని తరుణ్ కపూర్ చెప్పారు. E20 ఇంధనం పనితీరు అద్భుతంగా ఉంటుందని పరీక్షలు, అధ్యయనాల ద్వారా స్పష్టమైందని తెలిపారు. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటుందనే ఆందోళనల్లో వాస్తవం లేదని, ఎక్కువ సమస్యలు ఇతర కారణాల వల్లే తలెత్తాయని రుజువైందని పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే ఇథనాల్తో పాటు ఇతర బయోఫ్యూయల్స్కు కూడా కొత్త డిమాండ్ను సృష్టించడం అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో పెట్రోలులో ఇప్పుడు కలుపుతున్న 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ బ్లెండింగ్ చేసే అంశాన్ని మోడీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తరుణ్ కపూర్ తెలిపారు. అయితే ఇది ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల లభ్యతపై, అలాగే పెట్రోల్ బంకుల్లో సదుపాయాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మన దేశ రిఫైనరీ ఉత్పాదనలో డీజిల్ వాటా భారీగా ఉన్నందున, డీజిల్కు సరిపోయే బయోఫ్యూయల్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.
ఇసోబ్యూటానాల్ ప్రత్యామ్నాయాలపై జరుగుతున్న ప్రయోగాలు విజయవంతమైతే.. బయోఫ్యూయల్ విస్తరణకు మరో పెద్ద మార్గం సుగమం అవుతుందని కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు దానిని డీజిల్ లో కలపాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. రవాణా రంగంతో పాటు వంటగ్యాస్, పారిశ్రామిక అవసరాల కోసం కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని పెంచే దిశగా చెరకు వ్యర్థాలు, మిగులు ఆహార ధాన్యాల ఆధారిత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పెట్టుబడులను కాపాడుకోవడంతో పాటు ఇథనాల్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి డిమాండ్ సృష్టి చాలా ముఖ్యమని కపూర్ అన్నారు. సాంప్రదాయ పెట్రోల్ బ్లెండింగ్కు అతీతంగా వాహన సాంకేతికతను మెరుగుపరచడం, కొత్త అప్లికేషన్లను ప్రోత్సహించడం ద్వారానే తదుపరి దశ బయోఫ్యూయల్ ప్రయాణం విజయవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
