యాదాద్రి, వెలుగు : జిల్లా యువతకు మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శిక్షణ పొందిన వారికి మూడు కంపెనీలు తొలుత రూ. 1.80 లక్షల ప్యాకేజీలో ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీమ్) ఆధ్వర్యంలో డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టామని చెప్పారు. ప్రోగ్రామింగ్ స్కిల్, జావా వంటి 14 వేర్వేరు విభాగాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రోగ్రామ్లో శిక్షణ పొందిన అభ్యర్థికి కచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 లోగా htpps//yadadr.telangana.gov.in వెబ్సైట్లోని Skill Development Trining విభాగంలోకి వెళ్లి ఆసక్తి కలిగిన కోర్సుకు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ కలెక్టర్లు సాత్విక్ నాయక్, కృతిక ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
యాదగిరిగుట్ట : గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఉన్నతమైన విద్యను అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల, కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
