- సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కస్టమర్లవారీగా వివరాల డిజిటలైజేషన్
- అత్యాధునిక డిజిటల్ ప్లాట్ఫామ్గా
- మారుతున్న విద్యుత్ వ్యవస్థ
- కస్టమర్ సమస్యను నిమిషాల వ్యవధిలో పరిష్కరించే వీలు
- నెట్వర్క్ మ్యాపింగ్ భవిష్యత్ విద్యుత్ పంపిణీ వ్యవస్థకు బలమైన పునాది: సీఎండీ జితీష్ వి.పాటిల్
హైదరాబాద్, వెలుగు: దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) చేపట్టిన తొలిదశ సమగ్ర నెట్వర్క్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. అధికారులు కేవలం నెల రోజుల్లోనే హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలో గుర్తించిన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, వినియోగదారుల వారీగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ నెట్వర్క్ మ్యాపింగ్ తో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా.. విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ సంస్థకు (దక్షిణ డిస్కమ్కు) మధ్య జరిగే సేవలు, ఫిర్యాదుల పరిష్కారం మొత్తం పూర్తిగా అడ్వాన్స్డ్ డిజిటల్ నెట్వర్క్ పరిధిలోకి రాబోతున్నాయి.
మెట్రో జోన్ పరిధిలోని 27 ఈహెచ్ టీఎస్ విద్యుత్ సబ్స్టేషన్లు, 156 చోట్ల ఉన్న 33/11 కేవీ సబ్స్టేషన్ల పరిధిలోని నెట్వర్క్ మ్యాపింగ్ను పూర్తిచేశారు. అలాగే 266 చోట్ల ఉన్న 33 కేవీ ఫీడర్లు, 988 చోట్ల గల 11 కేవీ ఫీడర్లు, వీటి పరిధిలోని వినియోగదారుల మీటర్ల జియోగ్రాఫికల్ (జీఐఎస్) మ్యాపింగ్ కూడా పూర్తయింది. దీంతో సదరన్ డిస్కమ్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో రెండో దశ మ్యాపింగ్ పనులను ప్రారంభించారు.
సబ్స్టేషన్ నుంచి కస్టమర్ మీటర్ వరకు మ్యాపింగ్
విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ ఈ నెల1వ తేదీ నుంచి మ్యాపింగ్ డ్రైవ్ను ప్రారంభించింది. తొలి దశలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో పూర్తి చేశారు. గతంలో విద్యుత్ సమస్యలపై 1912 కాల్ సెంటర్, యాప్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు వచ్చినప్పుడు సమస్య ఎక్కడ ఉందో గుర్తించడానికి చాలా సమయం పడుతుండేది. సమగ్ర డిజిటల్ నెట్వర్క్ మ్యాపింగ్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
దీనిని నివారించేందుకు డిస్కమ్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో ఫీల్డ్ సర్వే నిర్వహించింది. ఫీల్డ్ ఇంజినీర్లు ప్రతి 11 కేవీ ఫీడర్కు అనుసంధానమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (డీటీఆర్) స్ట్రక్చర్ కోడ్లను పరిశీలించి ధ్రువీకరించారు. ఈహెచ్ టీ సబ్స్టేషన్ నుంచి 33 కేవీ ఫీడర్, 33/11 కేవీ సబ్స్టేషన్, 11 కేవీ ఫీడర్, డీటీఆర్ నుంచి వినియోగదారుని సర్వీసు మీటర్ వరకు మొత్తం విద్యుత్ నెట్వర్క్ను మ్యాపింగ్ చేశారు. వీటితో పాటు ఏబీ స్విచ్లు, ఆటో రీక్లోజర్లు, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు వంటి విద్యుత్ నెట్వర్క్ ఆస్తులను కూడా మొబైల్ యాప్ ద్వారా జీఐఎస్ ఆధారంగా నిక్షిప్తం చేశారు.
ఈ ప్రక్రియ ద్వారా వినియోగదారులకు, విద్యుత్ సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది భవిష్యత్తు స్మార్ట్ గ్రిడ్ నిర్మాణానికి, ఏఐ ఆధారిత వ్యవస్థల అమలుకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఏ సబ్స్టేషన్కు ఏ ఫీడర్, ఏ డీటీఆర్కు ఏ వినియోగదారులు అనుసంధానమై ఉన్నారో సులభంగా తెలుస్తుంది. దీనివల్ల లోడ్ మేనేజ్మెంట్ను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, భవిష్యత్ మౌలిక వసతుల ప్రణాళికలను శాస్త్రీయంగా రూపొందించడం డిస్కమ్కు చాలా సులభతరం కానుంది.
రెండో దశ వర్క్ షురూ
సమగ్ర నెట్వర్క్ మ్యాపింగ్ కార్యక్రమం రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ పంపిణీ వ్యవస్థకు బలమైన పునాది వేస్తుంది. వినియోగదారుల సేవల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పుతుంది. తొలిదశలో హైదరాబాద్మెగా సిటీలోని మెట్రో జోన్ పరిధిలో చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతం అయ్యింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో రెండో దశ వర్క్ జరుగుతుంది.
- జితీష్ వి.పాటిల్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ, హైదరాబాద్
