- ఓల్డ్ సిటీలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి బల్దియా కసరత్తు
- రూ.345 కోట్లతో 2.08 కిలోమీటర్ల మేర నిర్మాణం
- పరిపాలన అనుమతులు రాగానే షురూ
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఓల్డ్ సిటీ లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ మరో కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. మైలార్దేవ్పల్లి–కాటేదాన్ జంక్షన్ల మీదుగా శంషాబాద్ కి చేరుకునేలా ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలల క్రితం ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతలు కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టును రూ.345 కోట్ల అంచనా వ్యయంతో 2.08 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని అనుకుంటున్నారు.
సిటీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కాటేదాన్ జంక్షన్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ గ్రేడ్ సెపరేటర్ను ప్రతిపాదించారు. ఇది పూర్తయితే ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్ కర్మన్ ఘాట్ ప్రాంతాల వారు మైలార్దేవ్పల్లి, కాటేదాన్ మీదుగా శంషాడాద్ కి ఈజీగా చేరుకోవచ్చు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే వారికి ఈ ఫ్లై ఓవర్ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిపాలనా అనుమతులు రాగానే, టెండర్ ప్రక్రియ చేపట్టి పనులను ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.
