చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ ఔట్.. తెగ సంతోష పడుతున్న రోహిత్, కోహ్లీ

చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ ఔట్.. తెగ సంతోష పడుతున్న రోహిత్, కోహ్లీ

Ajit Agarkar: భారత్ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్‌గా కొనసాగించాలని అగార్కర్ అభ్యర్థించినప్పటికీ, బీసీసీఐ అందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్ కోసం బీసీసీఐ అన్వేషణ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, సెప్టెంబర్ తర్వాత జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లకు నయా సెలెక్టర్ నేతృత్వంలోనే భారత జట్టు ఎంపిక జరగనుంది.

4 ఐసీసీ టోర్నీలు.. 3 టైటిళ్లు సాధించిన అగార్కర్ ప్యానెల్: 
2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ హయాంలో భారత జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. అతడి పదవీ కాలంలో ఇండియా 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ లాంటి నాలుగు ప్రధాన ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. వీటిలో ఏకంగా మూడు టైటిళ్లను భారత్ గెలుచుకోవడం విశేషం. కేవలం ప్లేయర్స్ గణాంకాలపైనే ఆధారపడకుండా జట్టు కాంబినేషన్లు, వ్యూహాలు, ఆటగాళ్ల పాత్రలకు ప్రాధాన్యమిస్తూ అగార్కర్ ప్యానెల్ సెలక్షన్ చేపట్టింది. వీటి ఆధారంగానే 2025లోనే అతడి కాంట్రాక్ట్‌ను ఏడాది పొడిగించింది. ఈసారి మాత్రం మరోసారి అతడ్ని కొనసాగించేందుకు బీసీసీఐ రెడీగా లేదు.

జట్టు ఎంపికలో వివాదాస్పద నిర్ణయాలు: 
విజయాలు సాధించినప్పటికీ, అజిత్ అగార్కర్ హయాంలో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 కెప్టెన్‌గా నియమించడం, అలాగే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, తన ఎంపికలను, వ్యూహాత్మక నిర్ణయాలను అగార్కర్ ఎప్పటికప్పుడు సమర్థించుకుంటూ వచ్చారు.

ALSO READ : ఫుట్‌బాల్‌కు లియోనల్ మెస్సీ గుడ్‌బై?..

చిగురించిన రోహిత్, కోహ్లీల 2027 వన్డే వరల్డ్ కప్ ఆశలు: 
అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటే భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు 2027 వన్డే ప్రపంచకప్ ఆడే మార్గం మరింత సుగమం అవుతుందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ తర్వాత బాధ్యతలు చేపట్టే కొత్త చీఫ్ సెలెక్టర్ నేతృత్వంలోని ప్యానెల్ ఇచ్చే ప్రాధాన్యతలపైనే వీరిద్దరి భవిష్యత్తు, వన్డే వరల్డ్ కప్ ప్రాతినిధ్యం ఆధారపడి ఉంది.