దుబాయ్: పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచులో ఆమె ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేల్చింది. ఈ మేరకు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.5 కింద ఫాతిమాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. అలాగే, ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేర్చింది. ఇప్పటికే ఫాతిమా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ఉంది. క్రికెట్లో ఒక ప్లేయర్కు 24 నెలల (రెండు సంవత్సరాల) వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే సస్పెన్షన్ ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ఏం జరిగిందంటే..?
మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 5) ఇండియా, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారత బౌలర్ల దెబ్బకు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం ఇండియా 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. టీమిండియా లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాది దూకుడుగా ఛేజింగ్ మొదలుపెట్టింది.
6 బంతుల్లో 12 రన్స్ చేసిన షెఫాలీ దూకుడు ఆడుతోన్న క్రమంలో రెండో ఓవర్లో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్లో ఔట్ అయ్యింది. షెఫాలీ ఇచ్చిన రిటర్న్ క్యాచును ఫాతిమా ఈజీగా అందుకుంది. వికెట్ పడిన తర్వాత పాక్ కెప్టెన్ ఓవర్గా సెలబ్రేషన్స్ చేసుకుంది. షెఫాలీని గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది. ఫాతిమా ప్యూరియస్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వివాదస్పదంగా మారగా ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
