హిందూ పురాణాల ప్రకారం శ్రీమహా విష్ణువు ఆషాఢమాసం శుద్ద ఏకాదశి ( 2026 జులై25) రోజు యోగ నిద్రలోకి ప్రవేశించారు. నాలుగు నెలలపాటు అంటే నవంబర్ 20 వరకు యోగనిద్రలో నే ఉంటారని పండితులు చెబుతున్నారు. ఆయన క్షీర సముద్రంలో ఆదిశేషునిపై యోగ నిద్రా సమయంలో భూలోకంలో మానవులు కొన్ని నియమాలు పాటించాలి.. ఈ నాలుగు నెలలు మానవులు ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. మొదలగు వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
పురాణాల ప్రకారం ఆషాఢమాసం శుక్ల పక్షం ఏకాదశి రోజు( 2026 జులై 25) నుంచి కార్తీక మాసం ఉద్దాన ఏకాదశి ( నవంబర్ 20) వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. ఆ రోజున గరుడ వాహనంపై వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తాడని పండితులు చెబుతారు. ఈ మధ్యలో ఉండే నాలుగు నెలలను కలిపి చాతుర్మాసంగా చెబుతారు. .
ఈ సమయంలో భూలోకంలో మానవులు చాతుర్మాస దీక్షను పాటించాలి. ఈ దీక్షను ప్రతి ఏడాది నాలుగు నెలల పాటు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా బ్రహ్మచారులు, సన్యాసులు, వివాహితులు చేయొచ్చు. ఈ వత్రాన్ని ఆచరించిన వారికి దేవుని అనుగ్రహం లభించి.. వారి కోరికలు తీరి.. ఉత్తమ గతులు కలుగుతాయని భవిష్య పురాణంలో పేర్కొన్నారు. అయితే ఈ వ్రతాన్ని నాలుగు నెలలు చేయలేని వాళ్లు రెండు నెలలు చేసుకోవచ్చు. ఇది కూడా సాధ్యం కాని వారు ఒక నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. అదీ కాదంటే వచ్చే ఐదు ఏకాదశుల నాడు వ్రతం చేస్తే మంచి ఫలితాలొస్తాయని నమ్ముతారు. అంతేకాదు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధన లాభం లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కఠిన నియమాలున్న కారణంగా ఈ వ్రతం పీఠాధిపతులు, మఠాధిపతులకు మాత్రమే ఈ వ్రతం పరిమితమైంది.
►ALSO READ | జ్యోతిష్యం:ఉద్యోగంలో కష్టాలు తొలగాలన్నా.. పిల్లలకు బాగా చదువురావాలన్నా జులై 29న చేయాల్సిన పని ఇదే..!
ఈ నాలుగు నెలల కాలంలో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస దీక్షను ఏర్పాటు చేసినట్లు పండితులు చెబుతారు. ఈ వ్రతాన్ని సన్యాసులు నాలుగు నెలల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఒకే చోట దీక్ష వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేసేవారు ప్రతిరోజూ తెల్లవారుజామునే స్నానం చేసి శ్రీ మహా విష్ణువు ఎదుట కూర్చుని పూజలు చేయాలి. ఈ కాలంలో మీరు ఏ పని చేసినా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను, ఇష్టదేవతలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి.
ఏంచేయాలి
- చాతుర్మాసంలో లక్ష్మీనారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి.
- ఈ దీక్షను చేపట్టిన వారు బ్రహ్మచార్యాన్ని కొనసాగించాలి. నేలపైనే నిద్రించాలి.
- చాతుర్మాసంలో పెరుగు తినడం తగ్గించాలి లేదా మానేయాలి. ముఖ్యంగా రాత్రి వేళలో పెరుగు తినకూడదు.
- ఈ కాలంలో ఆకుకూరలు, కూరగాయలు తినకూడదు.
- రెండో నెలలో పెరుగు, మజ్జిగ తీసుకోరాదు.
- మూడో నెలలు పాలు తీసుకోకూడదు.
- నాలుగో నెలలో పప్పు దినుసులు కూడా తీసుకోకూడదు.
- ఈ నాలుగు నెలల పాటు ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- మీ శక్తి సామర్థ్యాల మేరకు వస్త్రదానం, అన్నదానం, దీప దానం, శ్రమ దానం చేయాలి.
ఏయే ప్రయోజనాలంటే..
- చాతుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి శుభ ఫలితాలొస్తాయి.
- మీ వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో విశేష ఫలితాలొస్తాయి.
- దానధర్మాలు చేయడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అనేవే రావు.
- మీరు చేసే పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ కాలంలో నిత్యం లక్ష్మీనారాయణులను పఠించడం వల్ల మీకు సకల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.
ఈ పనులు చేయకూడదు..
- చాతుర్మాస కాలంలో వివాహాలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు తదితర 16 రకాల శుభ కార్యక్రమాలు నిషేధించబడ్డాయి.
- ఈ నాలుగు నెలల పాటు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు.
- చాతుర్మాసంలో మంచంపై నిద్రించకూడదు.
- ఈ నాలుగు నెలల పాటు ఎవరిపైనా కోపం, అహంకారం చూపకూడదు.
- ఈ నాలుగు నెలలు జుట్టు, గడ్డం కత్తిరించకూడదు.
- చాతుర్మాసంలో తేనే, ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు తినకూడదు. వర్షాకాలంలో తేమ వల్ల వీటిలో కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని తినకూడదని పెద్దలు చెబుతారు.
