అసహజంగా ముంచుకొస్తున్న ప్రకృతి విలయాలు

అసహజంగా ముంచుకొస్తున్న ప్రకృతి విలయాలు

సీజన్​తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రకృతి మనిషిని అల్లకల్లోలం చేస్తోంది. నిజానికి భూమ్మీద ప్రతిజీవి ప్రకృతి మీదే ఆధారపడి బతుకుతుంది. మూడు కాలాలు, ఆరు రుతువులు టైం టు టైం ఉంటేనే ​జీవన చక్రం కరెక్ట్​గా ఉంటుంది. అలాకాకుండా ఎండాకాలంలో వానలు, చలికాలంలో ఎండలు కాస్తే! వాతావరణంలో వచ్చే మార్పులకు మనిషితో సహా భూమ్మీద ఉన్న ఏ ప్రాణీ తట్టుకోలేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అంతటి విపత్తుల వెనక బోలెడన్ని కారణాలు​ ఉండొచ్చు. వాటన్నింటికి ముఖ్య కారణం మాత్రం మనిషే. పెరుగుతున్న టెక్నాలజీ మనిషి లైఫ్​స్టైల్​లో మార్పులు తెస్తోంది. దాంతో వాతావరణంలో విషవాయువులు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం ప్రకృతి మీద తీవ్రంగా ఉంటోంది. కొంతకాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులు గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది.

అకాల వర్షాలు, వరదలు, భూకంపాలు, కరువు.. ఇవి సహజంగా వచ్చే మార్పులు కావు. అసహజంగా ముంచుకొస్తున్న ప్రకృతి విలయాలు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రకృతి ప్రకోపానికి బలవ్వాల్సిందే. ఇది మింగుడుపడని విషయమే. అయితే ఇప్పటికైనా ఒంటిమీదకు కాస్త తెలివి తెచ్చుకుని నడుచుకోకపోతే పర్యావరణాన్ని కాపాడుకోవడం కష్టం. అంతెందుకు మనల్ని మనమే రక్షించుకోలేం. జీవనానికి సరిపడా వనరులు ఉంటే చాలు. కానీ, అవసరమైనదానికంటే ఎక్కువైతేనే విపరీత పరిణామాలు ఎదురవుతుంటాయి. ఇక్కడా అదే జరిగింది. నిజానికి వానలు లేకపోతే తాగు, సాగు నీరు ఉండదు. కానీ, ప్రకృతి లైఫ్​సైకిల్​లో మార్పులు వచ్చి ఏకధాటిగా వానలు కురిస్తే మాత్రం ఇలాంటి నష్టాలే జరుగుతాయి. వానల్ని కంట్రోల్​ చేయడం సాధ్యం కాదు కదా? మన చేతుల్లో ఏముంది? అనొచ్చు. కానీ, వాతావరణంలో వచ్చే మార్పులకు పరోక్షంగా మనమే కారకులవుతున్నాం అన్నది అక్షర సత్యం. అసలు వాతావరణ మార్పులకు కారణాలేంటి? వాటి వల్ల ఏం జరుగుతుంది?

వాయు కాలుష్యం.. 

శిలాజ ఇంధనాల(ఫాజిల్ ఫ్యూయల్స్)ను కాల్చడం ద్వారా వచ్చే పొగ వల్ల భూగ్రహం వేడెక్కింది. దాంతో గ్లేసియర్స్ ఐస్​క్రీంలా కరిగిపోతున్నాయి. అంతేకాకుండా వాటి నుంచి నల్లని మసి, రేణువులను విడుదల చేస్తాయి. ఆ రేణువులు గాలి ద్వారా పైకి వెళ్లి మంచుపై పడతాయి. అక్కడ అవి మంచు కంటే ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీనివల్ల మంచు వేగంగా వేడెక్కి కరిగిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల గ్లేసియర్స్​ను రక్షించొచ్చని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ఇటుక బట్టీలు, కలప నుండి వచ్చే పదార్థం ఈ ప్రాంతంలో మూడింట రెండు వంతుల బ్లాక్ కార్బన్‌‌ను కలిగి ఉంటుంది. రెండవ అతిపెద్ద కాలుష్య కారకాలు డీజిల్ వాహనాలు. ఇవి 7–18% మధ్య కాలుష్యానికి కారణమవుతున్నాయి.

2021 రిపోర్ట్​ చెప్పే నిజాలివి 

2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని స్టేట్​ ఆఫ్​ ది క్లైమెట్ రిపోర్ట్​ చెప్తోంది. వాతావరణంలో గ్రీన్‌‌హౌస్ గ్యాస్​ ఎమిషన్స్ సాంద్రత రికార్డు స్థాయికి చేరుకుంది. దాంతో గత ఏడేండ్లుగా టెంపరేచర్ పెరుగుతోందని ఈ స్టడీలో తెలిసింది. అదే విధంగా గ్రీన్​ ల్యాండ్​లో మంచుకు బదులు మొదటిసారి వాన కురిసింది. కెనడా, అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు చెలరేగాయి. వాటి వల్ల కొన్నిచోట్ల టెంపరేచర్​ అమాంతం పెరిగింది. చైనాలోని ఒక ప్రాంతంలో నెలలో కురవాల్సిన వాన కొన్ని గంటల్లో కురిసింది. యూరప్​లో వచ్చిన వరదల కారణంగా ప్రాణ, ఆర్థిక నష్టాలు చాలా జరిగాయి. దక్షిణ అమెరికాలో వరుసగా రెండో ఏడాది కరువు వచ్చింది. దాంతో నదుల్లో నీటిమట్టం తగ్గింది. అగ్రికల్చర్, ట్రాన్స్​పోర్ట్, ఫ్యూయల్ ప్రొడక్షన్స్ బాగా దెబ్బతిన్నాయి. 

1990లో శాటిలైట్​ బేస్డ్ సిస్టంతో సముద్ర మట్టాన్ని కొలవడం మొదలైంది. 1993 నుంచి 2002 మధ్య సముద్ర మట్టాలు ఏడాదికి 2.1 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. కానీ, 2013 నుంచి 2021 మధ్యలో ఈ లెక్క రెట్టింపయింది. ఏడాదికి 4.4 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. ముఖ్యంగా మంచు కరిగిపోవడంతో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. ‘‘గత రెండు వేల ఏండ్లలో ఇలా పెరిగింది లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాలు 2 మీటర్లు దాటిపోవచ్చు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల జనాభా ఇండ్లు కోల్పోతారు. ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించలేం” అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 

ముందే పసిగట్టారు

పాకిస్తాన్‌‌లోని పర్వత ప్రాంతంలో 70 లక్షల మంది ప్రజలు మరింత వరదల బారిన పడే ప్రమాదం ఉందని సైంటిస్ట్​ల అంచనా. కానీ, భూమి వేడెక్కకుండా చేయగల శక్తి మనలో లేదు. పాకిస్తాన్​లో విడుదలయ్యే వాయువులు కేవలం1% వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అఫ్గానిస్తాన్, నేపాల్ వంటి దేశాలు కూడా అందుకు తక్కువే కారణమవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ దేశాలే వాతావరణ మార్పులకు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ప్రమాదం అంచున ఉన్నట్లే అనిపిస్తోంది. వాతావరణ మార్పులు వల్ల జీవరాశులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనుషులకు శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో మొదటిది వేడి వాతావరణం.

వేడి పెరిగితే కష్టమే

ఓ మాదిరి వేడి వరకు మాత్రమే శరీరం తట్టుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువైతే తట్టుకోలేదు. వేడి తీవ్రత పెరిగిపోతే ఆ వేడికి కండరాలను బ్రేక్ చేసేంత శక్తి ఉంటుంది. అందుకనే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకూడదు అంటారు. ఎందుకంటే ఆ వేడికి గుండె కండరాలు, కణాలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేడి ఎక్కువైతే ఒత్తిడికి కూడా లోనవుతారు. అప్పుడు గుండె.. రక్తాన్ని వేగంగా సరఫరా చేస్తుంది. అదే టైంలో చెమట రూపంలో సోడియం, పొటాషియం శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు హార్ట్​ ఎటాక్​ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎండ ఎక్కువగా ఉంటే డీహైడ్రేషన్​ బారిన పడతాం అనే విషయం తెలిసిందే. దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటికే కిడ్నీల కండిషన్ సరిగా లేకపోతే  వేడి తీవ్రత వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంది. ఈ విషయంలో వృద్ధులు చాలా కేర్​ఫుల్​గా ఉండాలి. భూమి వేడెక్కేకొద్దీ, దోమలు వాటికి అనుకూలమైన ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో చేరి... జికా వైరస్, డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవేకాకుండా కలరా, టైఫాయిడ్, పారాసైట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. 

తిండి కూడా దొరకదు

వాతావరణంలో మార్పుల వల్ల ఫుడ్ ప్రొడక్షన్​ తగ్గుతుంది. సరఫరాపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనిషికి అవసరమైన పోషకాలు​ కూడా తగ్గిపోతాయి. ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (ఐపిసిసి) స్పెషల్​ రిపోర్ట్ ప్రకారం... ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే పంటలు సరిగా పండడం లేదు. అంతేకాకుండా వాతావరణంలో ఉన్న కార్బన్–​ డై –ఆక్సైడ్​ పెరగడం వల్ల మొక్కల్లో ఉన్న జింక్, ఐరన్, ప్రొటీన్ వంటి న్యూట్రియెంట్లు నాశనం అవుతున్నాయి. పోషకాలు లేని ఫుడ్​ ఎంత తిన్నా వేస్టే. పోషకాలు తగ్గితే అనారోగ్యాలు, క్యాన్సర్, డయాబెటిస్​, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అలాగైతే నీళ్లలో పెరిగే జలచరాల్ని తిందాంలే అనుకుంటున్నారా? అదికూడా లాభంలేదు. ఎందుకంటే వేడి వాతావరణాన్ని తట్టుకోలేక అవి ధృవ ప్రాంతాలకు వలసపోతున్నాయి. దాంతో చేపలు, రొయ్యల వంటి వాటి నుంచి వచ్చే పోషకాలు కూడా మనిషికి అందకుండా పోతాయి.

ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ

అడవులు కాలిపోవడం, సునామీల వంటి ప్రకృతి విపత్తులు ఈ మధ్య ఎక్కువ కావడం వల్ల ఊహించని నష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెస్తాయని చెప్తున్నారు శాస్ర్తవేత్తలు. ఆగస్ట్​లో అమెరికా, యూరప్, సైబీరియా దేశాల్లో అడవులు కాలిపోయాయి. దాంతో గాలిలో కాలుష్యం పెరిగి పోయింది. ఆ గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, రక్తం​లోకి కలుషితాలు చేరిపోతాయి. శరీరంలోని అవయవాల మీద నేరుగా ప్రభావం చూపకపోయినా, ఇమ్యూనిటీ సిస్టమ్​ మీద దాని తాలూకా ప్రభావం తప్పక పడుతుంది. దీనివల్ల ఏటా3.6 నుంచి 90 లక్షల వరకు అకాల మరణాలు జరుగుతున్నాయని అంచనా. అంతేకాకుండా 65 ఏండ్లు పైబడిన వాళ్లకు కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్​ కలిగించే వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. 

మానసికంగా కూడా...

ప్రకృతి విపత్తుల వల్ల వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఉదాహరణకు విదేశాల్లో అడవులు తగలబడటాన్నే తీసుకుందాం. అప్పుడు అక్కడ నివసించే వాళ్లలో కొందరు తమ ఇండ్లు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరైతే సొంతవాళ్లను కోల్పోయారు. మనదేశంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి. సునామీల వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగి పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్​కి దారితీస్తుంది. దీన్నే ‘సొలాస్టాల్జియా’ అంటారు. ఈ జబ్బు పోను పోను సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.

ఏం చేయాలి?

భౌగోళికంగానే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న ఇన్ని అనర్థాలను ఎలా ఆపాలి? అందుకేం చేయాలని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చేసింది. అలాగే ప్రకృతికి మనం చేస్తున్న నష్టాల గురించి అవగాహన పెంచుకోవాలి కూడా. చెట్లు నరికితే వర్షాలు పడవు. భూములు ఎండిపోతాయి. పంటలు పండవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటన్నింటి వల్ల తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కరువు అవుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చెట్లు నరకడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం. అలాగే వాహనాలు.. వాటి నుంచి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తుంది. మనిషి తెలివితేటల్ని ఉపయోగించి లైఫ్​ని ఈజీ చేయాలన్న ఆలోచనతో ఏసీలు, ఫ్రిజ్​లు కనిపెట్టాడు. కానీ, వాటి నుంచి విడుదలయ్యే గాలి చాలా ప్రమాదకరం. నిజానికి వీటినుంచి వెలువడే విషగాలుల వల్లే ఓజోన్​ పొరకు రంధ్రం పడింది. కానీ, అవి లేకుండా బతకలేనంతగా ఆ వస్తువులకి అలవాటు పడిపోయాం. ఆ అలవాటుకు దూరమవ్వాలంటే.... ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలి. ఇంటికి మంచి వెంటిలేషన్ ఉండాలి. ఇంటినుంచి బయటకు అడుగుపెడితే టూవీలర్​ లేదా కార్​ ఎక్కకుండా.. ఎక్కువ దూరాలు జర్నీ చేయాలంటేనే వెహికల్స్ వాడాలి. వీలైనంత వరకు నడిచి వెళ్లాలి. నడిచి వెళ్లే దూరం కాదంటే సైకిల్ మీద వెళ్లడం మంచిది. ఇప్పటికే కొన్ని దేశాలు, మనదేశంలో కొన్ని రాష్ట్రాలు సైకిల్​ వాడకాన్ని పెంచాయి. దీనివల్ల గాలి కాలుష్యంతో పాటు సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. 

సముద్రాలు పొంగితే అంతా నాశనమే

మధ్య ఆసియా పర్వత ప్రాంతాన్ని- ‘హై-మౌంటైన్ ఆసియా’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయన్, కారకోరం, హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి. చైనా నుండి అఫ్గానిస్తాన్ వరకు విస్తరించి ఉన్నాయి. మధ్య ఆసియా పర్వత ప్రాంతంలో 55,000 గ్లేసియర్​లు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాల బయట మరెక్కడా లేని విధంగా ఎక్కువ మంచి నీటి నిల్వలు ఉన్నాయి. ఇక్కడ కరిగే నీరు ఆసియాలోని10 అతిపెద్ద నదులకు ఆధారం. దీని బేసిన్లలో దాదాపు రెండొందల కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 2015 ప్రపంచ బ్యాంకు రిపోర్ట్​ ప్రకారం75 కోట్ల ప్రజల జీవనోపాధికి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు మాత్రమే నీటి వనరులు. 

చైనాలోని యాంగ్జీ నది ఖండంలోనే అతిపెద్దది.- ఆగ్నేయాసియాలోని మెకాంగ్ కూడా హిమాలయ జలాలపై ఆధారపడింది. కానీ, వేడి ఉష్ణోగ్రతలు వాటిని ప్రమాదంలో పడేస్తాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండింతలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో మంచు కరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్‌‌ను అదుపు చేయడంలో విఫలమైతే, మధ్య ఆసియాలోని పర్వతాల్లోని మంచు కరిగి, వందేండ్లు పూర్తయ్యేనాటికి మూడింట రెండు వంతుల భాగం కనుమరుగైపోతుంది.

జర్మన్ క్లైమెట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం– వాతావరణ మార్పుల వల్ల అత్యంత ప్రమాదకరమైన పది దేశాల్లో నేపాల్, పాకిస్తాన్ ఉన్నాయి. అయితే మొదటి ఇరవై దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ‘హిమానీనదాలు కచ్చితంగా కరిగిపోతాయి. ప్రస్తుతానికి సరిపడా మంచినీరు ఉంది. కానీ, ముందుముందు ఎంత నీరు ఉంటుందో తెలియని పరిస్థితి. మన దగ్గర ప్రజలకు వ్యవసాయం ప్రధాన ఆదాయవనరు. మెరుగైన నీటి నిర్వహణ, నీటి శుద్ధిలో పెట్టుబడి పెట్టకపోతే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే’ అని కోల్​కతా, జెఐఎస్ యూనివర్సిటీ సైంటిస్ట్ భట్టాచార్య హెచ్చరించారు.

చల్లటి దేశాల్లో వేడి!

చల్లటి వాతావరణం ఉండే అమెరికా, యూరప్​లోని దేశాల వాతావరణంలో కూడా కొన్నేండ్లుగా మార్పులొచ్చాయి. ఇవి సంపన్న దేశాలు కావడంతో అక్కడ ఫ్యాక్టరీలతోపాటు వెహికల్స్​, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఎక్కువ. దాంతో కార్బన్ ఎమిషన్స్ గాల్లో ఎక్కువగా కలుస్తాయి. దానివల్ల గాలిలో కాలుష్యం, టెంపరేచర్స్ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల వల్లే రెండుమూడేండ్లుగా అమెరికా, యూరప్​ దేశాల్లో వేడి తీవ్రత ఎక్కువై అడవులు కార్చిచ్చులతో మండిపోతున్నాయి. అలాగే అక్కడి మంచు కూడా కరిగిపోతోంది. చలికాలంలోనూ టెంపరేచర్స్ బాగా పెరిగి, ప్రజలు ఏసీలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. 

పాకిస్తాన్​ ఎందుకలా...

పాకిస్తాన్‌‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో మంచు కొండలు కరిగి, నదులు, సరస్సులు నిండిపోతాయని అని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, ఈ ప్రాంతంలో 70% మంచినీటి కొరత ఏర్పడుతుందని సైంటిస్ట్​లు చెప్పారు. ఎక్కువ నీరు ప్రవహిస్తే ఆనకట్టలు తెగిపోతాయన్నారు. ‘హై మౌంటైన్ ఆసియా మొత్తం వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమవుతుంది’ అని హెచ్చరించారు ఎక్స్​పర్ట్స్​. అదలా ఉంటే.. వర్షాకాలంలో అదే పాకిస్తాన్​లో వరదలు ముంచెత్తాయి. ఇండ్లు మునిగిపోయాయి. ప్రజలంతా తలో దిక్కు చేరారు. నడిచే దారి లేక నీళ్లలో పడవల మీద ప్రయాణాలు చేశారు. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక నానా అవస్థలు పడ్డారు. పాకిస్తాన్​లో ఎక్కువ టెంపరేచర్స్, కుండపోత వర్షాలకు కారణం వాతావరణ మార్పులే అని సైంటిస్ట్​లు చెప్తున్నారు. 

కార్బన్​ ఎమిషన్స్​ అక్కడే ఎందుకు ఎక్కువ?

మనదేశంతోపాటు చైనా కూడా కార్బన్​ న్యూట్రల్​ లేదా కార్బన్​ నెగెటివ్​ దేశాలుగా మారకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ రెండు దేశాల్లో ఫ్యాక్టరీలు, మైనింగ్​ పనులు, వెహికల్స్​ ఎక్కువ. వాటి నుంచి కర్బన సమ్మేళనాలు విడుదలవుతాయి. అయితే, కార్బన్ ఒక్కటే కాదు.. అమ్మోనియా, నైట్రోజన్ సమ్మేళనాలు విడిపోయినప్పుడు కూడా కర్బన​ వాయువులు వెలువడతాయి. అవి గాల్లో కలిసిపోతాయి. కానీ.. ఈ రెండు దేశాల్లో ఆర్థికాభివృద్ధి వీటిమీదే ఆధారపడి ఉంది. కాబట్టి కార్బన్ ఎమిషన్స్​​ తగ్గించే చర్యలు తీసుకోవడంలో వెనక్కి తగ్గుతున్నాయి. పైగా ఇండియా, చైనాలో బొగ్గు వనరులు ఎక్కువ. వీటి ద్వారానే ఈ దేశాల్లో విద్యుత్​ ఉత్పత్తి జరుగుతుంది. ఒక స్టడీ ప్రకారం 2030 నాటికి ఈ దేశాల్లో బొగ్గు 37శాతం అధిక శక్తి వనరుగా మారుతుందనేది ఒక అంచనా. దీనిని ఇండియా, చైనా ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తాయట. అంటే.. ఈ రెండు దేశాలు కార్బన్​ ఎమిషన్స్​ తగ్గించడం సంగతి అటుంచితే మరింత పెరిగేందుకు కారణమవుతాయి. పోయినేడాది గ్లాస్​ గో కాప్ – 26 సమ్మిట్​లో చైనా 2050, భారత్​ 2070కి జీరో ఎమిషన్​ టార్గెట్​ పూర్తి చేస్తామని మాటిచ్చాయి.

ఎల్​ నినో, లా నినా ఎలా వస్తాయంటే...

చాలా ఏండ్లపాటు వాతావరణంలో వచ్చే నార్మల్ వాల్యూకన్నా ఎక్కువ లేదా తక్కువ వాల్యూ ఉండడాన్ని క్లైమెట్ ఛేంజ్ అంటారు. అంటే... సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మారితే దానిపైనున్న గాలులు కూడా మారతాయి. ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం పైన ఉన్న ఉష్ణోగ్రతల ఆధారంగా ఒక్కోసారి తూర్పుగాలులు బలహీన పడి, పశ్చిమంలో బలంగా వీస్తాయి. అలాంటప్పుడు ప్యాటర్న్స్​ మారతాయి. ఇదే పరిస్థితి మిగతా సముద్రాల్లో కూడా జరుగుతుంటుంది. వీటిని సముద్రం మీద వీచే గాలులు (ఓషన్ కరెంట్స్) అంటారు. ఇవి మారినప్పుడు భూమిపైన ఉపరితలంలో గాలులు కూడా మారతాయి. ఈ మార్పులు కేవలం ఒక్కచోటే కాదు.. ఏడు ఖండాల్లో కనిపిస్తాయి. దీనికి కారణం సర్క్యులేషన్ ప్యాటర్న్​.. ఈ ప్యాటర్న్​ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. దాంతో సీజన్స్​లో మార్పులు వస్తుంటాయి. అంటే.. ఉపరితలం మీద మార్పులు వస్తే పైన ఉండే గాలిలో కూడా మార్పులు వస్తాయి. క్లైమెట్ ఛేంజ్​కి ఇది ముఖ్య కారణం. ఇలాంటి మార్పులు ఆరు నుంచి ఏడేండ్లకు ఒకసారి వస్తాయి. 

మనదేశంలో..

తూర్పు పసిఫిక్ గాలులు బలంగా ఉంటే, అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వీచే గాలులు బలహీన పడతాయి. ఇలాంటప్పుడు నార్మల్​గా కాకుండా ‘లా నినా’ లేదా ‘ఎల్​ నినో’ కండిషన్స్ ఏర్పడతాయి. తూర్పు పసిఫిక్​లో వేడి వాతావరణం ఉంటే, ఎల్ ​నినో కండిషన్, చల్లగా ఉన్నప్పుడు లా నినా కండిషన్ ఏర్పడుతుంది. అంటే ఎక్కువ వాల్యూ వస్తే ఎల్ ​నినో, తక్కువ వస్తే లా నినా వస్తుంది. ఇవి ఐదారేండ్లకు ఒకసారి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు గాలి దిశలో మార్పులు వస్తాయి. పసిఫిక్​ సముద్రం మీద వీచే గాలుల్లో తేడా వచ్చినప్పుడు అవి బలహీనంగా ఉండి, మనదేశాన్ని తాకకపోతే ఎల్​ నినో కండిషన్​ ఏర్పడి వర్షాలు తగ్గిపోతాయి. అన్ని ఎల్​ నినో సంవత్సరాలు కరువు తీసుకురావు. కానీ.. నార్మల్ రోజుల కంటే తక్కువ ఉన్న సంవత్సరాలు కూడా ఉన్నాయి. అది ఎల్​ నినో లక్షణం. చాలావరకు ఎల్​ నినో ఇయర్స్ కరువు తీసుకొస్తాయి.

అప్పుడు మన దేశంలో వర్షాలు పడాల్సిన ప్రాంతాల్లో వర్షాలు పడవు.

లా నినా కండిషన్​లో తీవ్రమైన గాలులు వీస్తాయి. దాంతో సముద్రం నుంచి తేమ ఎక్కువగా వాతావరణంలోకి రావడంతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అన్ని లా నినా కండిషన్స్​లో వరదలు వచ్చే సూచన ఉండదు. కానీ.. లా నినా​ కండిషన్​లో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు లోకల్​గా ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్రస్తుతం లా నినా కండిషన్​ మనదేశం మీద ఇంకా ఉంది. ఈ పరిస్థితి ప్రపంచమంతటా ఇలాగే ఉంటుంది. యూరప్​ వంటి దేశాల్లో వాతావరణం వేరేగా ఉంటుంది. కానీ.. లా నినా కండిషన్ ఎక్కువ అవ్వడం వల్ల గ్లోబల్ సర్క్యులేషన్​లో మార్పులు వచ్చాయి. దాంతో టెంపరేచర్స్ ఆపోజిట్​గా పనిచేశాయి. మన రాష్ట్రం విషయానికొస్తే.. రెండేండ్ల నుంచే లా నినా కండిషన్స్ వల్ల వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి. మిగతా టైంలో వర్షాకాలం​ బాగానే ఉంది. ఎంత వర్షపాతం ఉండాలో అంతే ఉంది. 

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ప్రకృతి విపత్తులు అకస్మాత్తుగా వచ్చినవి కాదు. కొన్నేండ్ల నుంచి ఉన్నవే. మొదటిసారిగా1992లో జర్మనీలోని రియో డి జెనిరోలో ‘వరల్డ్ ఎర్త్​ సమ్మిట్’ జరిగినప్పుడే దీన్ని డిక్లేర్​ చేశారు. అది డిక్లేర్​ చేసి, ఇప్పటికే 30 ఏండ్లు అయింది. అప్పటి నుంచి ‘ఇంటర్ గవర్నమెంటల్​ ప్యానెల్ ఆన్​ క్లైమేట్ ఛేంజ్’(ఐపీసీసీ) రిపోర్ట్స్​రావడం మొదలైంది. దీన్ని మొదలుపెట్టడానికి కారణం... ప్రాంతీయంగా పర్యావరణ అంశాలను పట్టించుకోకుండా ప్రవర్తించడం, డెవలప్​మెంట్ చేస్తున్నామంటూ గుడ్డిగా వెళ్లడం,​ నేచర్​ని నిర్లక్ష్యం చేయడం. వీటివల్లే ఇలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనదగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉంది. స్థానికంగా వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. ఉదాహరణకు హైదరాబాద్​నే​ చూస్తే... ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. బిల్డింగ్​లు, ఫ్యాక్టరీలు, వెహికల్స్ పెరిగిపోయాయి. కాలుష్యం​ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 

తెలంగాణలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షం గుర్తుందా? ఏ ప్రభావం వల్ల అలా జరిగిందనేది తెలుసుకోవాలి. కానీ, 20 ఏండ్లుగా దాని సంగతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు. ఆ తర్వాత 2005లో, 2016లో ఇలాంటి విపత్తులే వచ్చాయి. గత ఐదేండ్ల నుంచి ఏటా వానలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే, విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారు. తర్వాత దాని ఊసే ఉండదు. దీనికి ముఖ్య కారణం వాటర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ (నీటి మౌలిక సదుపాయం) సరిగా లేకపోవడం. 

వాటర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అంటే.. మంచి నీటి సరఫరా ఎలా జరగాలి? వాన నీళ్లు, మురికి నీళ్లు ఎలా వెళ్లాలి? అనే వాటి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వరద, మురికి నీళ్లు రెండూ కలిసి ప్రవహిస్తున్నాయి. ట్రాఫిక్​ సమస్య కోసమని ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లు కట్టించడం పైన దృష్టి పెడుతున్నాయి. కానీ ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టించినా వాటర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సరిగా లేకపోతే ట్రాఫిక్ సమస్య అలానే ఉంటుంది. వెహికల్స్ వల్ల కార్బన్ ఎమిషన్​ ఎక్కువ అవుతుంది. అదంతా గాల్లోనే కలుస్తుంది. 
పరిష్కారం ఏంటంటే.. 2012లో గవర్నమెంట్​ ఆఫ్ ఇండియా, అర్బన్ ఫ్లడింగ్ లిటిగేషన్​ పేరుతో ఒక బుక్​ తెచ్చింది. దాన్ని స్పష్టం​గా చదివి, అందులో ఉన్నవి అమలు పరిస్తే చాలు. ఇదే గత 20 ఏండ్లుగా నేను ఎన్నోసార్లు రిపోర్ట్​లు రాసి, వాటిని అమలు చేయమని ఇచ్చా. వాటిలో ఏ ఒక్కటీ అమలుచేయలేదు. ఆ గైడ్​లైన్స్ పాటిస్తే రాబోయే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 
 - డా. బి.వి సుబ్బారావు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్, వాటర్ రీసోర్సెస్ అండ్ క్లైమెట్ ఛేంజ్

కలుషిత గాలి పీలుస్తున్నాం

మనదేశంలో 99 శాతం మంది కలుషిత గాలినే పీలుస్తున్నారని ఒక స్టడీలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తయారుచేసిన అతిసూక్ష్మ ధూళి కణ కాలుష్యం పీఎం 2.5 బేస్డ్ యాన్యువల్ హెల్త్​ గైడ్​లైన్స్​ను మించి అయిదు రెట్లు ఉందని చెప్పింది. గ్రీన్ పీస్ ఇండియా డిజైన్ చేసిన ‘డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై’ పేరుతో ఈ నెలలో విడుదల చేసిన రిపోర్ట్​– దేశంలోని 62 శాతం మంది గర్భిణులు అత్యంత కాలుష్య పూరిత ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పింది. యాన్యువల్ రిపోర్ట్​ యావరేజ్​ పీఎం 2.5 పొల్యూషన్ ఎక్స్​పోజర్ దేశంలో అత్యంత కాలుష్యానికి గురయ్యేది ఢిల్లీ నగరం అని పేర్కొంది. ఆ గాలిని పీల్చడం వల్ల శిశువులు, గర్భిణులు, వయసు మీద పడిన వాళ్లు ఎక్కువగా ఎఫెక్ట్​ అవుతారని చెప్పింది. అతి సూక్ష్మ ధూళికణ కాలుష్యాన్ని పీఎం 2.5గా చెప్తారు. ఇది శరీరం లోపలికి చొచ్చుకుపోతుంది. దాంతో ఊపిరితిత్తులు, శ్వాస నాళంలో వాపు వస్తుంది. గుండె జబ్బులకు, శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఇమ్యూనిటీ దెబ్బతింటుంది.