టూర్లకు పోతున్న లీడర్లు

టూర్లకు పోతున్న లీడర్లు
  •      పోలింగ్ ముగియడంతో ఫ్యామిలీ, అనుచరులతో ప్రయాణాలు

హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు రిలాక్స్ అవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న లీడర్లు ఫ్యామిలీ, పిల్లలకు దూరంగా ఉన్నారు. వచ్చే నెల 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ ఉంది. అప్పటికి ఇంకా 20 రోజుల టైమ్ ఉండటంతో టూర్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు.

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలతో మంత్రి పొంగులేటి మంగళవారం శబరిమలై వెళ్లారు. మంత్రితో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లులు ఉన్నారు. మంగళవారం ఉదయం కొచ్చి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కగా సాంకేతిక లోపం కారణంగా విమానం మొరాయించింది. తరువాత బయలు దేరింది. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తన అల్లుడుతొ యాక్టివాపై కరీంనగర్ వీధుల్లో కొద్దిసేపు చక్కర్లు కొట్టారు.

చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన బంధువులు, పిల్లలతో గడిపారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఫ్యామిలీతో కలిసి నేడో రేపో తిరుపతి తో పాటు పలు ప్రాంతాలకు 15 రోజుల పాటు వెళ్లనున్నారని ఆయన అనుచరులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మంగళవారం అమెరికా బయల్దేరి వెళ్లారు. వీరితో పాటు మరికొందరు ఎంపీ అభ్యర్థులు, మంత్రులు కూడా త్వరలో టూర్లకు వెళ్లనున్నట్లు సమాచారం.