‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ పాత డైలాగ్.. ‘దేశానికి ప్రధాని అయినా బిడ్డకు తల్లే’ ఇప్పుడు కొత్త సామెత. నిజమే! ప్రధాని పదవిలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన రెండో నాయకురాలిగా న్యూజిలాండ్ ప్రధాని ‘జెసిండా ఆడెర్న్’ ప్రపంచానికి తెలుసు. ఇటీవల ఆమె సమావేశంలో ఉన్నప్పుడు తన బిడ్డ కోసం టైం తీసుకోవడం మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది.
‘ప్రధాని పదవిని కిరీటంలా కాకుండా ఉద్యోగంలా ఫీలవుతా’ అని చెప్పిన మాటలతో మొదట్లోనే ఆమె ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా న్యూజిలాండ్ ప్రజలకు ఆమె ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. కొవిడ్ టైంలో ఎంతో బాగా పనిచేసి న్యూజిలాండ్ను కాపాడిన నాయకురాలిగా వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా మరోసారి కొవిడ్ రూల్స్ గురించి ఆమె అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశం అంతా ఫేస్బుక్ లైవ్లో స్ట్రీమ్ అయింది.
దేశ పరిస్థితుల గురించి సీరియస్గా మాట్లాడుతుంటే... ఆమె మూడేళ్ల కూతురు ‘మమ్మీ’ అంటూ జెసిండాను పిలిచింది. పాపకు నవ్వుతూ జవాబు ఇచ్చి మళ్లీ మీటింగ్లో మాట్లాడటం మొదలు పెట్టంది. అది గమనించిన ఆ పాప మరోసారి ‘ ఇంకా ఎంతసేపు మమ్మీ’ అని అడిగింది. అందుకు జెసిండా ఏమాత్రం కంగారు పడలేదు. ‘ ఇది నిద్రపోయే టైం తల్లీ!’ అని పాపకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ, పాప 'నో' అని మారాం చేసింది. ‘ఇప్పుడు నిద్రపోవాలమ్మా. వెళ్లి పడుకో. నేను ఇప్పుడే వస్తా ’ అంటూ జెసిండా కూతురును ఊరుకోబెట్టింది. మళ్లీ మీటింగ్లో జాయిన్ అవుతూ అందరికీ ‘సారీ’ చెప్పి మీటింగ్ కంటిన్యూ చేసింది. కొద్ది సేపటికి ఆ పాప అలాగే పిలవడం మొదలుపెట్టింది. వెళ్లకపోతే ఆ పాప ఏడ్చేలా ఉండేసరికి జెసిండా సమావేశం నుంచి బయటకు వెళ్లక తప్పలేదు.
జెసిండా కూతురు పేరు నెవె అరోహ. పాప పుట్టిన మూడు నెలలకే జెసిండా పాపను తీసుకొని ఐక్యరాజ్య సమితి మీటింగ్కు వెళ్లింది. కేర్ టేకర్గా తండ్రి కూడా వచ్చాడు. అరోహకు డెలిగేట్ ఐడి కార్డ్ ఇష్యూ చేశారు అధికారులు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జెసిండా మాట్లాడు తుంటే అరోహను తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించాడు. ఆ పాపకు న్యాపీలు మార్చడం లాంటి విజువల్స్ ఐక్యరాజ్యసమితిలో మొదటిసారి కనిపించాయి. అలా జెసిండా దంపతులు, కూతురు అప్పట్లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.