నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ గా కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ బుధవారం (డిసెంబర్20) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎజీటీ చైర్మన్ గా ట్రిబ్యునల్ ఏర్పాటైన లక్ష్యాన్ని సాధించే విధంగా లేవనెత్తిన అంశాలను పరిగణనలోనికి తీసుకునేందుకు కృషి చేస్తానని శ్రీవాస్తవ చెప్పారు. పర్యావరణ సమస్యలు, ప్రధానంగా అభివృద్ధి కార్యకలాపాల మధ్య వైరుధ్యం, పర్యావరణంపై వాటి ప్రతికూల ప్రభావం కారణంగా సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి సమతుల్య విధానం అవసరం అని శ్రీవాస్తవ అన్నారు.
NGT మాజీ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ ఐదేళ్ల సుదీర్ఘ పదవీ కాలం తర్వాత జూలై 6న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ట్రిబ్యునల్ లోని న్యాయవ్యవస్థ సభ్యుడు జస్టిస్ షియో కుమార్ సింగ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
జస్టిస్ శ్రీవాస్తవ 2008 జనవరిలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్ లో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 మార్చిలో అక్కడ పదవీ విరమణ చేశారు.