ముంబై: ప్రతిపక్షాలు టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. 26/11 ఉగ్రదాడి సమయంలో యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరేను చంపింది టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కాదని, ఆర్ఎస్ఎస్తో సంబంధమున్న పోలీసు అధికారి అని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఫడ్నవీస్ ఆదివారం స్పందించారు.
ప్రతిపక్ష నేతలు ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్ను టార్గెట్ చేస్తూ.. టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ‘‘కసబ్ కు కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీ మద్దతు ఇస్తుంటే, బీజేపీ కూటమి మహాయుతి ఉజ్వల్ నికమ్ కు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి’’ అని ఫడ్నవీస్ అన్నారు. కాగా, కర్కరేను చంపింది కసబ్ కాదని, ఆర్ఎస్ఎస్తో లింక్ ఉన్న పోలీస్ అని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెతివార్ ఇటీవల కామెంట్ చేశారు. కాగా, కసబ్కు ఉరిశిక్ష పడిన 26/11 టెర్రర్ అటాక్ కేసులో ఉజ్వల్ నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు.