భారత విదేశంగా మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్, ఆ దేశ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోనంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. పాక్ ప్రధాని నిజంగా మంచి మనసున్న వారే అయితే మసూద్ అజార్ను భారత్కు అప్పగించాలన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు. భారత్ జరిపిన వైమానిక దాడుల గురించి ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నించగా.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు జరిపింది. కానీ పాక్ మిలిటరీ మాత్రం జైషే తరఫున మన దేశంపై దాడికి యత్నించిందని తెలిపారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్ర సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తోందని ఆరోపించారు. తీవ్రవాద రహిత వాతావరణం మధ్యే మేం పాక్తో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకెళ్లవుగా అని పాక్ పై సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ రాజనీతిజ్ఞుడు అని కొంతమంది చెబుతున్నారని, ఆయనకు అంత శక్తే ఉంటే జైషే అధినేత మసూద్ను భారత్కు అప్పగించాలని సుష్మా డిమాండ్ చేశారు.