కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట

కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌లపై జారీ అయిన నాన్‌ బెయిలబుల్ వారెంట్లపై ఇవాళ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆరేళ్ల క్రితం దాఖలైన ఓ పరువు నష్టం కేసులో కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ నిన్న(మంగళవారం) నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. లాయర్ సురేంద్ర శర్మ ఈ ముగ్గురిపై పరువునష్టం దావా వేశారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శర్మకు టికెట్ ఇచ్చేందుకు అంగీకరించిన సిసోడియా, యాదవ్, ఆమాద్మీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ.. చివరిలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తర్వాత రోజు పేపర్లో ఆయన పరువుకు భంగం కలిగించేలా వార్తలు వచ్చాయి. దీంతో అదే ఏడాది అక్టోబర్ 14న శర్మ కోర్టును ఆశ్రయించారు.