‘ఓ’ పాజిటివ్ కు బదులు ‘బీ’ పాజిటివ్ రక్తం 

‘ఓ’ పాజిటివ్ కు బదులు ‘బీ’ పాజిటివ్ రక్తం 

ఒక గ్రూపునకు బదులు వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో ఓ 25 ఏళ్ల మహిళ చనిపోయింది. ఈ దారుణమైన ఘటన ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో జరిగింది. కుత్రా బ్లాక్ లోని బుదకటకు చెందిన సరోజిని కాకు అనే మహిళ సికిల్ సెల్ అనీమియా తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే రక్త మార్పిడి కోసం రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి గురువారం మధ్యాహ్నం వెళ్లింది. అయితే.. రక్తం ఎక్కించిన కాసేపటికే ఆమె చనిపోయింది. 

ఆస్పత్రి సిబ్బంది వేరే గ్రూపు రక్తం ఎక్కించడం కారణంగానే చనిపోయిందని సరోజిని బంధువులు ఆరోపించారు. సరోజిని బ్లడ్ గ్రూపు 'ఓ' పాజిటివ్ అని.. కానీ ‘ బీ’ పాజిటివ్ రక్తం ఎక్కించారని ఆరోపించారు. అందుకే ఆమె చనిపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు కూడా విచారణ కమిటీని నియమించారు. అయితే.. తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ జదీశ్ చంద్ర బెహెరా చెప్పారు. అన్ని టెస్టులు చేశాకే రక్తం ఎక్కిస్తామని, తప్పుడు రక్తం ఎక్కిస్తే కేవలం పావుగంటలోనే చనిపోతారని తెలిపారు.