GST Collections: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?

GST Collections: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?

2024 ఏప్రిల్‌ నెల జీఎస్టి వసూళ్లు దుమ్ము రేపాయి. ఏకంగా రూ. 2.10 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 12.4 శాతం వసూళ్లు పెరిగాయి. ఆర్థికమంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశీయ లావాదేవీలు 13.4 శాతం పెరిగిపోవడంతో పాటు దిగుమతులు 8.3 శాతం వరకు పెరిగాయి. జీఎస్టీ రిఫండ్‌ తర్వాత నికరంగా ఏప్రిల్‌ నెలలో రూ. 1.92 లక్షల కోట్లుగా తేలింది.

17.1 శాతం పెరుగుదల..(GST Collections)

గత ఏడాది (2023) ఇదే ఏప్రిల్‌ నెలతో పోల్చుకుంటే జీఎస్టీ వసూళ్లు 17.1 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో సెంట్రల్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (సీజీఎస్‌టి) రికార్డు స్థాయిలో రూ. 43.846 కోట్లు వసూలు కాగా.. స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (ఎస్‌జీఎస్‌టి) వసూళ్లు రూ.55,538 కోట్లు చేరాయి. ఇక ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (ఐజీఎస్టి) వసూళ్లు రూ.99,623 కోట్లు, ఇక ఇంపోర్టెడ్‌ గూడ్స్‌ అంటే దిగుమతి చేసుకున్న వస్తువులపై రూ.37,826 కోట్ల వరకు వసూలు అయ్యాయి.

దీంతో పాటు ఇంటర్‌ గవర్నమెంటల్‌ సెటిల్మెంట్‌ ప్రాసెస్‌ కింద కేంద్ర ప్రభుత్వం సీజీఎస్‌టీ కింద రూ.50,307 కోట్లు , ఎస్‌జీఎస్‌టి కింద రూ.41,600 కోట్లు చెల్లించింది. రాష్ట్రాలకు వాటాలు చెల్లించిన తర్వాత నికరంగా మిగిలిన మొత్తం రెవెన్యూ విషయానికి వస్తే సీజీఎస్‌టి కింద రూ.94,153 కోట్లు ,ఎస్‌జీఎస్‌టి కింద రూ.95,138కోట్లు రాష్ట్రాలకు సెటిల్మెంట్‌ చేసిన తర్వాత మిగిలింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.20.18 లక్షల కోట్లుగా తేలాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 11.7 శాతం పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరం సరాసరి నెలవారి జీఎస్టి వసూళ్ల విషయానికి వస్తే రూ.1.68 లక్షల కోట్లుగా తేలింది. అంతకు ముందు ఆర్థికసంవత్సరం సరాసరి జీఎస్టి వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లుగా తేలింది.

జీఎస్టి వసూళ్లు క్రమంగా పుంజుకోవడాన్ని బట్టి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని తేలిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మందకొడిగా కొనసాగుతున్నా భారత్‌ మాత్రం నిలకడగా దూసుకుపోతోంది. ఇక గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ లేదా వస్తు సేవల పన్నును జులై 1, 2017 నుంచి దేశంలో అమల్లోకి వచ్చింది. జీఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ర్టాలు కోల్పోతున్న రెవెన్యూ నష్టాన్ని ఐదు సంవత్సరాల పాటు భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.