
- రాజేంద్రనగర్లో ఘటన
గండిపేట్, వెలుగు: ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులపై ఇద్దరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగింది. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించి, వివరాలు వెల్లడించారు. షేక్ అబ్దుల్లా(77) రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, ఆయన భార్య రిజ్వానా లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వీరికి నలుగురు పిల్లలు కాగా, ఇద్దరు అమెరికాలో, మరో ఇద్దరు లండన్లో ఉంటున్నారు.
అబ్దుల్లా, రిజ్వానా రాజేంద్రనగర్లోని జన చైతన్య ఫేస్–2లో కొత్తగా కట్టుకున్న ఇంటికి 40 రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరు దుండగులు ఒకరు క్యాప్, మాస్క్ పెట్టుకొని, మరో వ్యక్తి బుర్కా వేసుకొని వచ్చాడు. మాస్క్ పెట్టుకున్న వ్యక్తి అపార్ట్మెంట్ వాచ్మెన్తో మాట్లాడి తాము ఫిజియోథెరఫీ చేసేందుకు వచ్చామని చెప్పి పైకి వెళ్లారు. ఇద్దరూ పైకి వెళ్లిన 40 నిమిషాల తర్వాత మొదట ఒకరు కిందకు వచ్చారు. అరగంట తర్వాత మరో వ్యక్తి వచ్చాడు.
వాచ్మెన్ చెప్పిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రమే దంపతుల హత్య జరిగినట్లు తెలుస్తున్నది. పక్కా ప్లాన్ ప్రకారమే వీరిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో కత్తికి ఉన్న కవర్ను, ఒక దుండగుడి క్యాప్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అబ్దుల్లా ఒంటిపై ఏడు కత్తి పోట్లు, రిజ్వానా ఛాతిపై ఒక కత్తిపోటు ఉందన్నారు. డెడ్బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించామని తెలిపారు. ఇంట్లో నగలు, డబ్బు, ఇతర విలువైన వస్తువుల ఏమైనా పోయాయా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల పిల్లలకు సమాచారం అందించామన్నారు. ఏవైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.