ప్రాణాలు తీసిన ఆన్​లైన్​ లోన్​ యాప్​

ప్రాణాలు తీసిన ఆన్​లైన్​ లోన్​ యాప్​
  •      ఆర్థిక ఇబ్బందులతో కట్టలేకపోయిన  యువకుడు
  •     తండ్రికి, స్నేహితులకు ఫొటోలు  మార్ఫింగ్​ చేసి పంపిన ఏజెంట్లు 
  •     పరువు తీస్తున్నారని ఆత్మహత్య 

జోగిపేట, వెలుగు :  ఓ ఆన్​లైన్​ లోన్​యాప్​ సంగారెడ్డి యువకుడి ప్రాణం తీసింది. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. అందోల్​మండల పరిధిలోని కంసాన్​పల్లికి చెందిన కాడెం శ్రీకాంత్(21) ఎంఆర్ఎఫ్ ​కంపెనీలో లేబర్. ఆన్​లైన్​ లోన్​ యాప్స్​ అయిన ట్రూ బ్యాలెన్స్, గ్రాండ్​ ఫైనాన్సర్​తో పాటు మరో ఆరు యాప్​ల ద్వారా నవంబర్ నెలలో లోన్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు రూ.లక్షా ముప్పై వేలు కట్టాడు. వీటిని చెల్లించడానికే స్నేహితులు, పరిచయస్తుల దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. ఇంకా రూ.80 వేలు కట్టాలంటూ లోన్ ​యాప్​ ఏజెంట్లు వేధిస్తున్నారు. అదే పనిగా ఫోన్​ చేసి తిడుతుండడంతో జనవరి మొదటి వారంలో ఫోన్​ స్విచ్​ఆఫ్ ​చేసుకున్నాడు. 

దీంతో లోన్​ యాప్​ ఏజెంట్లు శ్రీకాంత్ ​నాన్న పోచయ్య, అతడి తమ్ముడు, స్నేహితుడు కిరణ్​ నంబర్లకు ఫోన్లు చేయడం స్టార్ట్​ చేశారు. శ్రీకాంత్​ ఫొటోలు మార్ఫింగ్ ​చేసి వారికి  పంపించారు. దీంతో పరువు తీస్తున్నానరి మనోవేదనకు గురైన శ్రీకాంత్​ గత నెల30న  గడ్డిమందు తాగాడు. సంగారెడ్డిలోని ప్రైవేట్​దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్​లోని నిమ్స్​కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. కేసు నమోదు చేసినట్లు జోగిపేట ఎస్​ఐ అరుణ్​కుమార్ ​చెప్పారు.