- హైదరాబాద్ సిటీలోని రద్దీ రోడ్లతోపాటు నేషనల్ హైవేలపైనా ఇదే సీన్
- తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్న రాంగ్ సైడ్ డ్రైవర్లు
- -ఏటా వేలల్లో యాక్సిడెంట్లు.. వందల్లో మరణాలు
- సిటీ కమిషనరేట్ పరిధిలో దాదాపు 61 రాంగ్ రూట్ స్పాట్స్ గుర్తింపు
- ఒక్కోచోట కిలోమీటర్ దాకా యూటర్న్ లేకపోవడం వల్లే తప్పడం లేదంటున్న వాహనదారులు
- గతేడాది 6.7 లక్షల రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు
- ఇటీవల గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఇద్దరు మృతి
నల్లగొండ జిల్లాకు చెందిన వినోద్(24) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నైట్ షిఫ్ట్ ముగించుకుని శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తన బుల్లెట్ బైక్పై గచ్చిబౌలి నుంచి కొత్తగూడ ఫ్లై ఓవర్ మీదుగా హైటెక్ సిటీ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్పేట్నుంచి రాంగ్రూట్లో వచ్చిన స్కూటినీ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాంగ్రూట్లో స్కూటీపై వచ్చిన శ్రీకాంత్, విఠల్ అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్ తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్నాడు.
హైదరాబాద్,వెలుగు: రాంగ్ సైడ్ డ్రైవింగ్డేంజర్ బెల్స్ మోగిస్తోంది. షార్ట్ కట్అంటూ రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తున్న వాహనదారులు వారితో పాటు ఎదుటి వారి ప్రాణాలను బలిగొంటున్నారు. యూటర్న్లను తప్పించుకునేందుకు అడ్డదారిలో వెళ్తు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపైనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకేంద్రాలు, నేషనల్, స్టేట్ హైవేలపై ఇదే పరిస్థితి నెలకొంది. చాలా రోడ్లపై యూటర్న్స్ల మధ్య దూరం కిలోమీటర్ నుంచి 2 , 3 కిలోమీటర్లకుపైగా దూరం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు రాంగ్రూట్లో ట్రావెల్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాంగ్ సైడ్డ్రైవింగ్ వే ఎక్కువ ఉంటున్నాయని, సిటీలో ఏటా వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.
యూటర్న్స్, నో ఎంట్రీ, వన్వే,
ఫ్లై ఓవర్స్ దగ్గరే ఎక్కువ..
హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 61 ప్రాంతాల్లో రాంగ్రూట్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను పరిశీలించారు. ఇలాంటి ప్రాంతాల్లో వన్వే, సిగ్నల్స్, యూటర్న్స్, ఫ్లై ఓవర్స్ కింద, నో ఎంట్రీ రూట్లో ఎక్కువగా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్, అండర్ పాస్, ఫ్లై ఓవర్స్ సహా ఎక్కువ దూరం యూ టర్న్స్ ఉన్న రోడ్లపై వాహనదారులు రాంగ్ రూట్, ఆపోజిట్రూట్లో ట్రావెల్చేస్తున్నారు. మెహదీపట్నం ప్రాంతంలో నూ ఇదే పరిస్థితి ఉంది. మెహదీపట్నం, మసాబ్ట్యాంక్ మధ్య సుమారు 2 కిలోమీటర్ల వరకు ఎలాంటి యూటర్న్ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేషనల్ హైవేస్ పైనా ఇదే పరిస్థితి ఉంది. శివారు ప్రాంతాల్లోని సర్విస్ రోడ్స్,ఫ్లై ఓవర్స్,సిగ్నల్ టైమింగ్ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్, స్టేట్ హైవేస్పై ప్రతిరోజూ రాంగ్సైడ్డ్రైవింగ్వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా అటు రవాణాశాఖ అధికారులుగానీ, ఇటు పోలీసులు గానీ కంట్రోల్చేయలేకపోతున్నారు. సరిపడా మ్యాన్పవర్ లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ప్రస్తుతం రాంగ్ సైడ్ డ్రైవింగ్చేస్తున్నవారికి చిన్నచిన్న జరిమానాలతో సరిపెడ్తున్నామని, అలాకాకుండా వాహనాలను సీజ్చేయడంతోపాటు ఏడాది వరకు జైలు శిక్షలు విధించడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వస్తుందని అధికారులు చెప్తున్నారు.
గ్రేటర్లో రోజూ సగటున 10 నుంచి 20 ప్రమాదాలు..
ప్రస్తుతం బయట కాలుపెడితే క్షేమంగా ఇంటికి చేరుకోవడం అనుమానంగా మారింది. వాహనదారులు అడ్డగోలుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమతోపాటు ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. ఔటర్ రింగ్రోడ్డు సహా గ్రేటర్ పరిధిలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజూ సగటున 10 నుంచి 20 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ఇద్దరు, ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. పదుల సంఖ్యలో గాయాలపాలవుతున్నారు. సిటీ రోడ్లపై జరుగుతున్న రాంగ్ సైడ్ డ్రైవ్ ప్రమాదాల్లో ఎక్కువగా యూ టర్న్ల వద్దే ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ఈ మేరకు సిటీ కమిషనరేట్ పరిధిలో గతేడాది 6.7 లక్షల రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు చెప్తున్నా వాహనదారుల తీరులో మార్పు రావడం లేదు.
