పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ డౌన్..దేశవ్యాప్తంగా నిలిచిపోయిన కార్యకలాపాలు

పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ డౌన్..దేశవ్యాప్తంగా నిలిచిపోయిన కార్యకలాపాలు

దేశవ్యాప్తంగా పాస్ పోర్టు సేవలు నిలిచిపోయాయి. పాస్‌పోర్ట్ సేవా పోర్టల్లో సాంకేతిక లోపంతో శుక్రవారం (జూన్ 20) పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ,పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

గురువారంనుంచి పాస్ పోర్టు  సేవలల్లో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దరఖాస్తు దారుల అపాయింట్ మెంట్లు రద్దయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని పాస్ పోర్ట్ కార్యాలయాలలో అపాయింట్ మెంట్లు దొరకడం ఆలస్యం అవుతోంది. దీంతో పాటు  ఢిల్లీ, భోపాల్, థానే వంటి పలు నగరాల్లో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ALSO READ | Fact Check: చెప్పినట్లు వినకుంటే కూతురి ఖర్చులు తండ్రి భరించక్కర్లేదా..? అసలు కోర్టు ఏం చెప్పింది?

అపాయింట్‌మెంట్‌లు రద్దవడం, రోజుల తరబడి నిరీక్షణ, సేవా కేంద్రాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదరయ్యాయని సోషల్ మీడియాలో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది తమ అపాయింట్‌మెంట్‌లు అర్ధరాత్రి రద్దైనట్లు మెసేజ్‌లు అందుకున్నారు. మరికొందరు PSKలకు వెళ్ళిన తర్వాత ఈ సమస్యను తెలుసుకున్నారని వాపోతున్నారు.

వినియోగదారుల ఆవేదన

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ముఖ్యంగా అత్యవసరంగా పాస్‌పోర్ట్ అవసరమైన వారు, ప్రయాణ షెడ్యూల్ దెబ్బతినడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి లేదా అధికారిక పాస్‌పోర్ట్ సేవా ఖాతా నుంచి  ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్‌మెంట్లు రద్దయిన వారికి తిరిగి అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నారు.

దరఖాస్తు దారులు ఏంచేయాలి..

ప్రస్తుతానికి పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ఎప్పుడు పూర్తిగా పనిచేస్తుందో స్పష్టత లేదు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలస్తోంది. దరఖాస్తుదారులు తాజా సమాచారం కోసం పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను (www.passportindia.gov.in) లేదా mPassport Seva మొబైల్ యాప్‌ను తరచుగా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు.