మీ పేరు రాసి చ‌నిపోతాం: TRS ఎమ్మెల్యేకు షాక్.. చెప్పులు విసిరారు

మీ పేరు రాసి చ‌నిపోతాం: TRS ఎమ్మెల్యేకు షాక్.. చెప్పులు విసిరారు

హైదరాబాద్: భారీ వర్షాలతో హైదరాబాద్ లోని పలు కాలనీలు ఆగమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు వరద బాధితుల పర్యటనకు వెళ్తుండగా.. అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమను వెంటనే ఆదుకోవాలని బుధవారం మంత్రి కేటీఆర్ ను నిలదీసిన వరద బాధితులు.. గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై తిరగబడ్డారు. భారీ వర్షాలకు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నియోజకవర్గమైన ఉప్పల్ లోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో గురువారం నష్టం జరిగిన కాలనీల పర్యటనకు పడవపై దర్జాగా వెళ్లిన ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారు కాలనీ వాసులు.

భారీ వర్షాలకు ఇండ్లు కూలాయని.. ఇంట్లో విలువైన వస్తువులు కొట్టుకుపోయాయని.. తమకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పేరు రాసి చనిపోతామన్నారు. పడవ దిగి కారు ఎక్కుతుండగా.. ఎమ్మెల్యే కాన్వాయ్ పై చెప్పులు విసిరారు కాలనీవాసులు. లీడర్లు వస్తున్నారు .. పోతున్నారు తప్ప.. ఎలాంటి న్యాయం చేయడంలేదంటున్నారు. తక్షణమే తమకు ఇండ్లు కట్టించి, నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు వరద బాధితులు. తినడానికి తిండిలేక.. ఉండటానికి ఇళ్లు లేకా చిన్న పిల్లలతో నానా అవస్ధలు పడుతున్నామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు వరద బాధితులు.