డీపీఎస్​లో విద్యార్థిని వేధించిన పీఈటీ

డీపీఎస్​లో విద్యార్థిని వేధించిన పీఈటీ

ఎల్​బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ లోని డీపీఎస్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్)లో విద్యార్థిని(13)ని పీఈటీ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయప్రకాష్ అనే వ్యక్తి నాదర్​గుల్​లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్​లో 6 నెలలుగా పీఈటీగా పని చేస్తున్నాడు. అతడు  ఓ విద్యార్థినిని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు.  

తన ఫోన్ నంబర్ ఆమెకు ఇచ్చి కాల్ చేయాలని, లేదంటే చనిపోతానని తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో కొద్దిరోజులుగా స్కూల్​కు వెళ్లేందుకు విద్యార్థిని ఇష్టపడం లేదు. పేరెంట్స్​కు అనుమానం వచ్చి విద్యార్థినిని అడగడంతో అసలు విషయం చెప్పింది. దీంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  జయప్రకాశ్​ను అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పేరున్న కార్పొరేట్ స్కూల్​లో ఇలాంటి ఘటన జరగడంతో పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు.