- రూ.5 వేల కోట్ల బకాయిలు రిలీజ్ చేయాలి
- తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరీ సతీశ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ స్టూడెంట్లకు ఇవ్వాల్సిన రూ.5,286 కోట్లు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరీ సతీశ్ డిమాండ్ చేశారు. రెండున్నర ఏండ్లుగా ఫీజులు ఇవ్వకపోతే, ప్రైవేటు కాలేజీలను ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీపీజేఎంఏ ఆఫీసులో జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ నరేందర్ రెడ్డి, నేతలు పార్థసారధి, సుధాకర్ రెడ్డి, సిద్ధేశ్వర్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రైవేటు విద్యా సంస్థలు కీలకంగా పనిచేశాయని, కానీ స్వరాష్ట్రంలో వివక్షకు గురవుతున్నాయని చెప్పారు. ఏండ్ల నుంచి ఫీజులు రిలీజ్ చేయకుండా కార్పొరేట్ కాలేజీలకు సర్కారు వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వం బకాయిల విడుదలకు టోకెన్లు రిలీజ్ చేసినా.. డబ్బులు మాత్రం మేనేజ్మెంట్లు, స్టూడెంట్ల ఖాతాల్లో పడటం లేదన్నారు.
జూన్లో రూ.1,550 కోట్లకు బీఆర్ఓలు రిలీజ్ చేసినా.. ఇప్పటికీ డబ్బులు రిలీజ్ చేయలేదన్నారు. లెక్చరర్లకు, సిబ్బందికి జీతాలిచ్చేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇంటర్లో ఫీజు రీయింబర్స్మెంట్ పెంచేందుకు ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేశారని, ఆ రిపోర్టు ఇప్పటికీ బయటపెట్టలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు అమర్నాథ్ రెడ్డి, హైమద్, సలీం, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.