మోడీ, పుతిన్ భేటీ 

మోడీ, పుతిన్ భేటీ 
  • ఎస్సీవో సమిట్​లో ప్రధాని మోడీ 
  • తృణధాన్యాల సాగు, వినియోగాన్ని ప్రోత్సహించాలె
  • యుద్ధానికిది సమయం కాదని పుతిన్ కు సూచన  

సమర్‌‌‌‌ఖండ్ (ఉజ్బెకిస్తాన్): షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సభ్య దేశాలు అన్నీ పరస్పరం సహకరించుకోవాలని, ఒకరిపై ఒకరు నమ్మకంతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఇండియా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. శుక్రవారం ఉజ్బెకిస్తాన్​లోని సమర్‌‌‌‌ఖండ్ లో జరిగిన 22వ ఎస్సీవో సమిట్ లో మోడీ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల గ్లోబల్ సప్లై చైన్​కు ఆటంకం ఏర్పడిందని, చాలా దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తిందని మోడీ అన్నారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించాలంటే మిల్లెట్ల(తృణధాన్యాలు) సాగు, వినియోగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. తృణధాన్యాల పంటలే ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు పరిష్కారమన్నారు. ఎస్సీవో ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆసియాలో సప్లై చైన్ నిరంతరం కొనసాగేలా సభ్య దేశాలన్నీ ఒకరికొకరు పూర్తిస్థాయిలో ట్రాన్సిట్ యాక్సెస్ ఇచ్చుకోవాలన్నారు. టూ వే ట్రేడ్ ను బంద్ పెట్టిన పాకిస్తాన్ తీరును ఇలా ప్రధాని పరోక్షంగా తప్పుపట్టారు.   

పలకరించుకోని మోడీ, జిన్ పింగ్  
లడఖ్ లోని గల్వాన్ లోయలో ఇండియా, చైనా ఆర్మీ మధ్య గొడవ, ఆ తర్వాత వరుసగా బార్డర్ టెన్షన్లు నెలకొంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ రెండేండ్ల తర్వాత ముఖాముఖి ఎస్సీవో సమిట్​లో కలుసుకున్నారు. అయితే, ఇద్దరు నేతలూ పలకరించుకోకుండా దూరం పాటించారు. పక్కపక్కనే నిలబడి ఫొటోలు దిగినా.. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోకపోవడం, కనీసం చిరునవ్వులతో సైతం పలకరించుకోకపోవడం చర్చనీయాంశం అయింది.  

పలువురు నేతలతో ప్రధాని భేటీ  
ఎస్సీవో సమిట్ సందర్భంగా ప్రధాని మోడీ టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షౌకత్ మీర్జియోయేవ్ తోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఎర్డోగన్ తో భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను రివ్యూ చేసిన ఇరువురు నేతలు.. వివిధ రంగాల్లో సహకారం మరింత పెంచుకోవడంపై చర్చించారు. ఇక గల్ఫ్ లో ఇండియాకు మంచి సహకారం అందిస్తున్న ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీంతోనూ మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.   

ఇండియాకు ఎస్సీవో ప్రెసిడెన్సీ బాధ్యతలు 
సమర్కండ్​లో జరిగిన 22వ ఎస్సీవో సమిట్​కు ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షౌకత్ మిర్జియోయేవ్ అధ్యక్షత వహించారు. సమిట్ ముగింపు సందర్భంగా ఆయన ఎస్సీవో ప్రెసిడెన్సీ బాధ్యతలను ఇండియాకు అప్పగించారు. 2023లో జరిగే ఎస్సీవో సమిట్​కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.

మోడీ, పుతిన్ భేటీ 
ఎస్సీవో సమిట్ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్​తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఉక్రెయిన్​తో యుద్ధం విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘యుద్ధానికి ఇది సమయం కాదు’ అని పుతిన్​కు సూచించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ.. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించాలని చూస్తున్నానని తెలిపారు. ఈ సంక్షోభం విషయంలో ఇండియాకు ఉన్న ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. అయితే, ఉక్రెయిన్ నాయకత్వం చర్చల ప్రక్రియను తిరస్కరించిందని, యుద్ధరంగంలో పోరాటం ద్వారానే లక్ష్యాలను సాధించాలని వాళ్లు కోరుకుంటున్నారని అన్నారు. అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపైనా మోడీ, పుతిన్ చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.