మీసం మొలిచినప్పటినుంచీ అది మాత్రం చేయలేదు

మీసం మొలిచినప్పటినుంచీ అది మాత్రం చేయలేదు

తనపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నిజం కాదని అన్నారు సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి. హైదరాబాద్ లో అమీర్ పేటలో తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారాయన. తాను అనారోగ్యంతో 2 నెలలపాటు ట్రీట్ మెంట్ తీసుకున్నానని చెప్పారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నిజం కావనీ… ఇపుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.

పదవులపై పోసాని స్పందన

జగన్ సీఎం అవుతారని ఏపీలో ఎవరూ అనుకోలేదని సినీ హాస్యనటుడు, ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ పృథ్వీ ఇటీవల అన్నారు. ఇండస్ట్రీ కూడా జగన్ కు యాంటీగా ఉందని అన్నారు. దీంతో.. జగన్ కు సపోర్ట్ ఇచ్చిన సినీ ప్రముఖులకు పదవులు వచ్చాయి.. కానీ.. పోసానికి రాలేదని కథనాలు వచ్చాయి. వైసీపీలో పనిచేసినా ఎటువంటి పదవలు రాలేదన్న బాధ పోసానిలో ఉందన్న వార్తలు కూడా వినిపించాయి. వీటిపై పోసాని స్పందించారు.

తాను ఎటువంటి పదవులను ఆశించడం లేదని పోసాని అన్నారు. 9 ఏళ్ల కిందట జగన్ యాత్రలు చేసినప్పుడు.. ఆయన వెంట రోజా, పోసాని అనే ఇద్దరు సినీ ప్రముఖులు తప్ప మిగతా ఎవరూ లేరని అన్నారు. ఇప్పుడు చాలామంది మద్దతుగా మాట్లాడుతున్నారని అన్నారు. వారికి పదవులు వస్తే తనకు ఎటువంటి ఈర్ష్య ఉండదన్నారు. మీసం మొలిచినప్పటినుంచీ తాను ఎవరినీ ఏదీ అడిగి తీసుకోలేదని… అడుక్కోలేదని అన్నారు. బెగ్గింగ్ అంటే ఏంటో తనకు తెలియదని అన్నారు. ఎవరైనా ఇది పోసాని ఐతే చేస్తాడు అని పని అప్పగిస్తే మాత్రం చేసి పెట్టానని చెప్పారు. జగన్ కూడా ఏదైనా పదవిని కోరి ఇస్తే మాత్రం వద్దని చెప్పను అని అన్నారు పోసాని కృష్ణ మురళి.