గర్భిణులకు ఫిజికల్ ఈవెంట్స్ ఉండవు
మినహాయింపు ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్
డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్కు అనుమతి
పరీక్షకు ముందు అండర్టేకింగ్ తప్పనిసరి
నోటిఫికేషన్ రిలీజ్చేసిన బోర్డ్
హైదరాబాద్, వెలుగు : గర్భిణి అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మినహాయింపు ఇచ్చింది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఫైనల్ ఎగ్జామ్కు అనుమతి ఇస్తున్నట్లు బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం గర్భిణులుగా ఉన్న అభ్యర్థులకు కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అయితే, ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు.. ఫిజికల్ ఈవెంట్స్లో పాల్గొని అర్హత సాధిస్తామని బోర్డ్కు లిఖితపూర్వకంగా అండర్టేకింగ్ ఇవ్వాలని సూచించారు. అండర్టేకింగ్ ఇవ్వని వారిని ఫైనల్ ఎగ్జామ్కు అనుమతించబోమన్నారు. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెల రోజుల్లో ఈవెంట్స్కు హాజరుకావాలని పేర్కొన్నారు.
అర్హత శాతం పెరిగింది
లాంగ్జంప్లో పురుషులు 83 శాతం మంది, మహిళలు 80 శాతం మంది అర్హత సాధించారని బోర్డ్ చైర్మన్ తెలిపారు. గతంలో పురుషులకు ఐదు, మహిళలకు 3 ఈవెంట్స్ నిర్వహించామని, ఈ సారి అందరికీ రన్నింగ్, లాంగ్జంప్, షార్ట్పుట్ మాత్రమే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పురుషులకు ఛాతీ కొలతలు తీసేవారని, ప్రస్తుతం ఎత్తు మాత్రమే డిజిటల్ మీటర్ల ద్వారా తీస్తున్నట్లు తెలిపారు. లాంగ్జంప్, షాట్పుట్లు కేవలం క్వాలిఫయింగ్ కోసమేనని చెప్పారు. ఒక్కొక్కరు మూడు సార్లు ప్రయత్నించే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారని వీవీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
70 శాతం ఈవెంట్స్ పూర్తి
ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫిజికల్ ఈవెంట్స్ చేపట్టామని చైర్మన్ తెలిపారు. ఇప్పటికే 70 శాతం మందికి ఫిజికల్ మెజర్మెంట్, ఎఫిషియెన్సీ టెస్ట్లు పూర్తి చేశామన్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్లో ఈవెంట్స్ నిర్వహణ పూర్తయిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, సిద్దిపేటలో ఈవెంట్స్ జరుగుతున్నాయన్నారు. మరో 8, 9 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. దీంతో ఫైనల్ ఎగ్జామ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు హాజరైన అభ్యర్థుల్లో 54 శాతం మంది ఫైనల్ ఎగ్జామ్ కు అర్హత సాధించారని శ్రీనివాస్రావు తెలిపారు.