
ముంబై: టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ బ్యాటర్ పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో ముంబైకి ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ)ను తీసుకున్నాడు. క్రికెటర్గా తన కెరీర్ను మరింత అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మరో దేశవాళీ జట్టుకు ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘రాబోయే డొమెస్టిక్ సీజన్లో మరో రాష్ట్రానికి ఆడేందుకు పృథ్వీ ఎన్వోసీ అడిగాడు. అన్నీ పరిశీలించిన తర్వాత ఎంసీఏ అధికారికంగా ఎన్వోసీని జారీ చేసింది.
ఇన్నేళ్లుగా ముంబై క్రికెట్కు గణనీయంగా సేవలందించాడు. అందుకు అతన్ని అభినందిస్తున్నాం’ అని ఎంసీఏ సెక్రటరీ అభయ్ హడప్ పేర్కొన్నారు. 2017లో ముంబై తరఫున డెబ్యూ చేసిన షా.. కెరీర్ ఆరంభంలో జూనియర్ టెండూల్కర్గా పేరు తెచ్చుకున్నాడు. కొన్నేళ్లు బాగా ఆడిన షా ఆ తర్వాత రకరకాల కారణాలతో ఫామ్, ఫిట్నెస్ కోల్పోయాడు. ఫలితంగా టీమిండియాకు దూరమయ్యాడు. అయినప్పటికీ ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. కానీ ఫామ్లేమితో గతేడాది రంజీ ట్రోఫీ జట్టు నుంచి తప్పించారు.