PBKS vs MI: ముంబైకి ఆసీస్ క్రికెటర్ దెబ్బ.. క్వాలిఫయర్-1 కు దూసుకెళ్లిన పంజాబ్

PBKS vs MI: ముంబైకి ఆసీస్ క్రికెటర్ దెబ్బ.. క్వాలిఫయర్-1 కు దూసుకెళ్లిన పంజాబ్

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ పటిష్టమైన ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది. జైపూర్ వేదికగా సోమవారం (మే 26) ముగిసిన మ్యాచ్ లో ముంబైపై 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో పర్వాలేదనిపించిన పంజాబ్.. బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ జోస్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73:9 ఫోర్లు, 3 సిక్సర్లు), టీమిండియా యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (35 బంతుల్లో 62:9 ఫోర్లు, 2 సిక్సర్లు) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. 

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 13 పరుగుల వద్ద ఔట్ కావడంతో పంజాబ్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముంబై బౌలర్లు చెలరేగడంతో పంజాబ్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 47 పరుగుల డీసెంట్ స్కోర్ చేసింది. ఈ దశలో జోస్ ఇంగ్లిస్, ప్రియాంష్ ఆర్య పంజాబ్ జట్టును నిలబెట్టారు. ముందుగా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా జూలు విదిల్చారు. దీంతో 10 ఓవర్లలోనే పంజాబ్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసి పటిష్ట ఛేజింగ్ దిశగా దూసుకెళ్లింది.
 
ఈ క్రమంలో 12 ఓవర్లో ఇంగ్లిస్ 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టి ఆర్య 29 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ క్రీజ్ లో కుదురుకోవడంతో మ్యాచ్ పూర్తిగా పంజాబ్ చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు సాంట్నర్ ఈ జోడీని 15 ఓవర్ తొలి బంతికి విడగొట్టాడు. రెండో వికెట్ కు 109 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఆర్య 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇంగ్లిస్ ఔటైనా చివర్లో శ్రేయాస్ అయ్యర్ (26) మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. 

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (39 బంతుల్లో 57:6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మరోసారి ముంబైకి ఆపద్బాంధవుడయ్యాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, విజయ్ కుమార్ వైశుక్, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. హరిప్రీత్ బ్రార్ కు ఒక వికెట్ దక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది.

ఓపెనర్లు రికెల్ టన్, రోహిత్ శర్మ క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం ఎక్కువగా తీసుకున్నారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 45 పరుగులు జోడించిన తర్వాత రికెల్ టన్ ను మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. పవర్ ప్లే లో 52 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ముంబై.. ఆ తర్వాత సూర్య, రోహిత్ కొన్ని ఓవర్ల పాటు నిదానంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ కు ప్రాధాన్యమిచ్చే క్రమంలో ముంబై పరుగుల వేగం తగ్గింది. క్రీజ్ లో ఉన్నంత వరకు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ శర్మ 21 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఆ తర్వాత తిలక్ వర్మ ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. క్రీజ్ లోకి రాగానే ఫోర్, సిక్సర్ వేసి ఊపు కనిపించిన విల్ జాక్స్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సూర్య కుమార్ యాదవ్ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో నమన్ ధీర్ (20) కూడా బ్యాట్ ఝుళిపించడంతో ముంబై 180 పరుగుల మార్క్ చేరుకుంది.