
ముషీరాబాద్, హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారని తెలిపారు. అందువల్ల మెగా డీఎస్సీపై జాప్యం చేయొద్దని చెప్పారు.
గురువారం విద్యానగర్ బీసీ భవన్ లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆర్. కృష్ణయ్య బీసీ భవన్ పీఆర్ఓగా రాజ్ కుమార్ కు నియామక పత్రాన్ని అందజేసి మాట్లాడారు. 25 వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో బడులు ఉన్నప్పటికీ టీచర్ల కొరత వల్ల విద్యార్థులు స్కూల్స్ మానేసి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల సమస్యను పరిష్కరించండి
బీసీ కుల గణన చేపట్టి, కోటా పెంచి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 18వ మహాసభ జరిగింది. కోడెపాక కుమార స్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు.
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో పదోన్నతులపై సమీక్ష నిర్వహించాలని కోరారు. 2009 తర్వాత నేరుగా నియమించిన ఉద్యోగులకు మెరిట్ ఆధారంగా జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, కెమిస్ట్, అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులకు పదోన్నతులు కల్పించాలన్నారు.