- అర్ధరాత్రి 2 తర్వాత తలపై బండరాయి వేసి హత్య
- డబ్బు, ఆభరణాలతో ఎస్కేప్
- మూడు హత్యలు, ఐదు చోరీల్లో జైలు శిక్షలు
- మద్యానికి బానిసై డబ్బు కోసం చోరీలు, హత్యలు
హైదరాబాద్, వెలుగు: ఫుట్పాత్పై బెగ్గర్స్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 12 గంటల వ్యవధిలోనే సైకో కిల్లర్ను అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం బెగ్గర్స్ను హత్య చేసినట్లు గుర్తించారు. గురువారం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మైలార్ దేవ్పల్లిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడి వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. రాజేంద్రనగర్ మాణిక్యం కాలనీకి చెందిన బ్యాగరి ప్రవీణ్(34) మైలార్దేవ్పల్లి లక్ష్మీగూడలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసై చోరీలు చేసేవాడు.
పాతనేరస్థులు షేక్ ఫయాజ్, దర్గ నరేశ్తో కలిసి దోపిడీలు చేస్తుండేవాడు. ఈ ముగ్గురు 2011లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గీత అనే మహిళపై అత్యాచారం చేసి మెడకు తాడుబిగించి హత్య చేశారు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఆ తరువాత ప్రవీణ్ ఒక్కడే వరుస దోపిడీలకు పాల్పడ్డాడు. ఫుట్ పాత్లపై బెగ్గర్స్ను టార్గెట్ చేశాడు అత్తాపూర్ పిల్లర్ నంబర్ 127 వద్ద ఫుట్పాత్పై నిద్రిస్తున్న చంద్రయ్య అనే బెగ్గర్ను హతమార్చాడు. తలపై బండరాయి వేసి హత్య చేశాడు. బుద్వేల్లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న పి.ప్రకాశ్అనే వ్యక్తిని హత్య చేశా డు. డబ్బు తీసుకుని పారిపోయాడు. ఈ మూడు కేసుల్లో 2014 జూన్లో ప్రవీణ్కు జీవితఖైదు పడింది. ఇలా 2010 నుంచి మూడు హత్య కేసులు, రెండు స్నాచింగ్స్, మూడు దోపిడీ కేసుల్లో ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. ఇందులో గీత హత్య కేసులో జీవిత ఖైదు పడగా స్నాచింగ్స్, దోపిడీల కేసుల్లో రెండేండ్ల శిక్షను అనుభవించాడు.
జైలు నుంచి రిలీజ్.. మళ్లీ హత్యలు
ఎనిమిది నెలల క్రితం ప్రవీణ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్లీ హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నాడు. రోడ్లపై తిరుగుతూ ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారిని గుర్తించేవాడు. వారితో పాటు నిద్రించేవాడు. ముందుగా పెద్ద బండరాయిని తనకు సమీపంలో పెట్టుకునేవాడు. తన పక్కనే పడుకున్నవారు నిద్రలో ఉండడం గమనించేవాడు. అర్ధరాత్రి దాటిన తరువాత 2గంటల ప్రాంతంలో వారి తలపై బండరాయి వేసి హత్య చేసేవాడు. వారి వద్ద ఉన్న డబ్బు, ఇతర విలువైన వస్తువులను దోపిడీ చేసేవాడు. ఈ నెల7న అర్ధరాత్రి మైలార్దేవ్ పల్లిలోని నేతాజీనగర్ రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఈ నెల 20న అర్ధరాత్రి దుర్గానగర్లో జంట హత్యలు చేశాడు. మైలార్దేవ్పల్లి స్వప్న థియేటర్ సమీపంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న బెగ్గర్ను హత్య చేశాడు. అతని వద్ద ఉన్న రూ.400 తీసుకుని పారిపోయాడు.
అదే దారిలో దుర్గానగర్ క్రాస్ రోడ్స్ ఫుట్పాత్పై నిద్రిస్తున్న మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన బ్లాంకెట్స్ వ్యాపారిని హత్య చేశాడు. అతని వద్ద రూ.1500 దోపిడీ చేశాడు. వరుస హత్యలు కలకలం రేపడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీన్ ఆఫ్ అఫెన్స్లో సేకరించిన ఆధారాలు, సీసీటీవీల ఫుటేజ్ ఆధారంగా ప్రవీణ్ను గుర్తించారు. జంట హత్యలు జరిగిన 12 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ప్రవీణ్ చేసిన హత్యల హిస్టరీని చెక్ చేస్తున్నారు.